నందికొట్కూరు: ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు మృతి చెందాడు. సోమవారం పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పాములపాడు మండలం వేంపెంట గ్రామానికి చెందిన పట్నం సామేలు(71) పట్టణంలోని వేలాంగిణి మాత తిరునాలకు వచ్చాడు. రాత్రి ఆటోలో తిరిగి వెళ్తుండగా ఎదురుగా బైకు వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ పక్కన కూర్చున సామేలు తీవ్రంగా గాయపడటంతో స్థానికులు వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. బైకుపై వెళ్తున్న ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఐచర్ వాహనం దగ్ధం
పత్తికొండ రూరల్: అటికెలగుండు గ్రామ బ్రిడ్జి సమీపంలో సోమవారం ఐచర్ వాహనంలో మంటలు చెలరేగి వాహనం దగ్ధమైంది. తాడిపత్రికి చెందిన ఐచర్ వాహనం సిమెంట్ లోడుతో ఆస్పరికి వెళ్లి అక్కడే అన్ లోడింగ్ చేశారు. తిరిగి వస్తున్న సమయంలో షార్ట్సర్క్యూట్ సంభవించి ఇంజన్లో వైర్లు కాలిపోయి మంటలు వ్యాపించాయి. డ్రైవర్ కంబయ్య వాహనంలో మంటలను గమనించి కిందకు దిగి ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. కొద్దిసేపటికే వాహనం మొత్తం మంటలు వ్యాపించాయి. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో దారి వెంట వెళ్తున్న వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు ఆర్పివేశారు. అయితే అప్పటికే వాహనం దగ్ధమైపోయింది.


