కర్నూలు(సెంట్రల్): అవుట్సోర్సింగ్ ఉద్యోగులతో రాష్ట్ర ప్రభుత్వం వెట్టిచాకిరి చేయించుకుంటోందని స్టేట్ గవర్నమెంట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు గంటా సంపత్కుమార్, ఈడుపుగంటి మోహన్రావు ఆరోపించారు. ఆదివారం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా వారు మాట్లాడుతూ.. సమాన పనికి సమాన వేతనం రూ.26 వేలు ఇవ్వాలని సుప్రీంకోర్టు చెబుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు. అవుట్సోర్సింగ్ పేరుతో నెలకు రూ.10 వేల జీతం ఇస్తూ శ్రమదోపిడీ చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా పదవీ విరమణ వయసును 62 సంత్సరాలకు పెంచాలని డిమాండ్ చేశారు. సంక్షేమ పథకాలను వర్తింపజేయాలని కోరారు. అసోసియేషన్ కర్నూలు జిల్లా కమిటీకి జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా నాగరాజు, జనరల్ సెక్రటరీగా రాములు, ట్రేజరర్గా శివప్రసాద్ ఎన్నికయ్యారు.


