డోన్: గత ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ డోన్ పర్యటన సందర్భంగా ప్రజలకు అనేక హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కటి కూడా నెరవేర్చలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డోన్ నియోజకవర్గంలోని జలదుర్గంను మండల కేంద్రంగా మారుస్తామని చెప్పి మరచిపోయారు. ఆర్హతలతో సంబంధం లేకుండా అధికారంలోకి రాగానే ప్రతి కుటుంబానికి రెండు సెంట్ల ఇంటి నివేశన స్థలం పట్టాలను మంజూరు చేస్తామనే మాట ఇప్పటి వరకు నెరవేరలేదు. గుండాల గ్రామంలో రిజర్వాయర్ నిర్మాణం చేపడుతామని, డోన్లో మైనింగ్ కళాశాల ఏర్పాటు చేస్తామని చెప్పి మోసం చేశారు.
డయాలసిస్ సెంటర్ లేనట్టే!
డోన్ వంద పడకల ప్రాంతీయ వైద్యశాలలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేస్తామని టీడీపీకి చెందిన ఒక ప్రజాప్రతినిధి హామీ ఇచ్చారు. రాష్ట్రంలో జిల్లా, ప్రాంతీయ, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రస్తుతం నడుస్తున్న 61 కిడ్నీ డయాలసిస్ సెంటర్లకు అదనంగా మరో 12 కొత్త కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ప్రకటించారు. మంత్రి ప్రకటించిన సెంటర్ల జాబితాలో డోన్ పేరు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో పీలేరు, భీమవరం, జమ్మలమడుగు, మైదుకూరు, రైల్వేకోడూరు, కొండిపి, కొవ్వూరు, నందిగామ, వినుకొండ, వెంకటగిరి, అద్దంకిలతో పాటు నంద్యాల జిల్లా సున్నిపెంట ఆసుపత్రుల్లో డయాలసిస్లు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. డోన్ వందల పకడల ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు అన్ని రకాల వసతులు కూడా ఉన్నాయి. అయినా ప్రకటన చేయకపోవడంపై ప్రజలు విమర్శిస్తున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.40 కోట్ల వ్యయంతో 10 ఎకరాల విస్తీర్ణంలో డోన్లో అత్యాధునిక వసతులతో ఆసుపత్రి నిర్మించింది. అప్పటి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని అన్ని విభాగాలకు ప్రత్యేక వైద్యులు, సిబ్బందిని నియమించారు. అన్ని సౌకర్యాలు ఉన్న ఆసుపత్రికి డయాలసిస్ సెంటర్ను ఏర్పాటు చేయకపోవడం ఏమటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
డోన్ ఏరియా ఆసుపత్రికి మంజూరు
కాని కిడ్నీ డయాలసిస్ సెంటర్
హామీలను విస్మరించిన
టీడీపీ ప్రభుత్వం
బూటకపు వాగ్దానాలపై ప్రజాగ్రహం


