మహానంది: గోపవరం గ్రామానికి చెందిన ఐటీఐ విద్యార్థి తిమ్మపోగు రాజు (17) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మహానంది పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. తిమ్మపోగు రాజు ఐటీఐ రెండో సంవత్సరం చదువుతున్నాడు. గురువారం రాత్రి గ్రామంలోని ఓ శుభకార్యానికి వెళ్లి శుక్రవారం ఉదయానికి కూడా తిరిగి ఇంటికి రాలేదు. ఈ క్రమంలో గ్రామ సమీపంలోని బావిలో మృతి చెంది ఉండటాన్ని స్థానికులు గుర్తించి కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. వెంటనే గ్రామస్తులు మృతదేహాన్ని వెలికితీశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. మహాలక్ష్మికి కుమారుడు, కూతురు ఉండగా ఒక్కగానొక్క కుమారుడు మృతిచెందడంతో శోకసంద్రంలో మునిగారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


