చిత్రంలో కనిపిస్తున్న ఈ వంతెనను చూస్తే అంత ప్రమాదకరరమేమి కాదు అనిపిస్తోంది. కానీ ఇక్కడ జరిగే ప్రమాదాలు గురించి తెలుసుకుంటే వామ్మో అనాల్సిందే. కోవెలకుంట్ల– లింగాల ఆర్అండ్బీ రహదారిలో మండలంలోని వల్లంపాడు సమీపంలో చిన్న వంచెవాగు వంతెన ప్రమాదకరంగా మారింది. వాగుపై ఇరుకై న లోలెవల్ వంతెన పూర్తిగా శిథిలావస్థకు చేరుకుని ప్రమాదాలకు నిలయంగా మారింది. వంతెన సమీపంలో రోడ్డుకు ఇరువైపులా మలుపులు ఉండటంతో వాహన చోదకులు ప్రమాదాల బారిన పడుతున్నారు. కోవెలకుంట్ల– నంద్యాల ఆర్అండ్బీ ప్రధాన రహదారిలో నేషనల్ హైవే రోడ్డు పనులు జరుగుతుండటంతో కల్వర్టుల నిర్మాణంలో పలుచోట్ల రోడ్డును తవ్వారు. దీంతో వాహన చోదకులు లింగాల మీదుగా నంద్యాలకు రాకపోకలు సాగిస్తున్నారు. రాత్రి వేళల్లో మలుపుల వద్ద ప్రమాదాల బారిన పడుతున్నారు. చిన్న వంచెవాగు కుందూనదికి అనుసంధానంగా ఉండటంతో వర్షాకాలంలో ఉప్పొంగి ప్రవహిస్తోంది. గత ఏడాది నెల రోజుల వ్యవధిలో ఇద్దరు యువకులు వాగు ఉధృతిని గమనించక వాగులో కొట్టుకపోయి మృత్యువాత పడ్డారు. సంబంధిత అధికారులు చర్యలు తీసుకుని వాహన చోదకులకు వంతెన కష్టాలు తీర్చి ప్రమాదాలు నివారించాలని కోరుతున్నారు.
– కోవెలకుంట్ల


