కోడుమూరు రూరల్: ప్రమాదవశాత్తూ గ్యాస్ సిలిండర్ పేలి ఇద్దరు గాయపడిన సంఘటన శుక్రవారం మధ్యాహ్నం కోడుమూరులో చోటు చేసుకుంది. స్థానిక గొల్లవీధికి చెందిన శివమ్మ రేకుల గుడిసెలో నివాసముంటోంది. శుక్రవారం పనిచేసేందుకు ఆమె బయటకు వెళ్లగా, కోడలు మాత్రంలో గుడిసెలో ఉంది. అయితే గుడిసెలోని గ్యాస్ సిలిండర్ లీకవ్వడంతో మంటలు వ్యాపించాయి. ఈ నేపథ్యంలో చుట్టుపక్కల వాళ్లు మంటలను ఆర్పేందుకు యత్నిస్తుండగా, గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో రేకులగుడిసె పూర్తిగా దగ్ధమవ్వడంతో పాటు, గుడిసె పక్కనే ఉన్న చెట్లు, గడ్డివాములకు నిప్పంటుకుంది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. కాగా గుడిసెకు నిప్పంటుకున్న సమయంలో గుడిసెలోని సామాన్లను బయటకు తీసుకొచ్చేందుకు వెళ్లిన రాముడు, చిట్టెమ్మకు మంటలు తాకి గాయాలయ్యాయి. ప్రమాదంలో శివమ్మ నివాసముంటున్న గుడిసె పూర్తి దగ్ధమవ్వడంతో పాటు, గుడిసెలోని వస్తువులు, తిండిగింజలు, నగదు కాలిపోవడంతో సుమారు రూ.3 లక్షల దాకా ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితురాలు వాపోయారు. కట్టుబట్టలతో రోడ్డున పడిన బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని కాలనీవాసులు కోరుతున్నారు.


