అడుగడుగునా గుంతలు.. తారు లేచి కంకర తేలిన దృశ్యాలు.. ఈ రోడ్డుపై ప్రయాణమంటే వాహనదారులు హడలిపోవాల్సిందే. ఏమాత్రం ఏమరపాటుగా ఉంటే నేరుగా ఆసుపత్రికి వెళ్లాల్సిందే. ఈ పరిస్థితులు ఉన్నా అధికారులు కనీసం మరమ్మతులు చేయడం లేదు. ఉయ్యాలవాడ – దొర్నిపాడు రహదారి ప్రమాదకరంగా మారింది. ఈ రహదారిలో ప్రయాణం చేయాలంటే ప్రాణాలను అరచేతిలో పెట్టుకోవాల్సిందే. ప్రయాణికులు, వాహనదారులు భయపడుతూ ప్రయాణిస్తూ ఇంటికి చేరుకుంటున్నారు. ఈ రహదారిని 2016–17లో ప్రధానమంత్రి సడక్ యోజన పథకం కింద 13.3 కిలో మేర అప్పట్లో రూ. 7.85 కోట్లు వ్యయం చేసి తారు రోడ్డు నిర్మించారు. ప్రస్తుతం తారు లేచి పోయి దాదాపు 8 కిలో మీటర్ల పూర్తిగా దెబ్బతింది. ఈ రహదారిలో రెండు మండలాల ప్రజలు నిత్యం ద్విచక్ర వాహనాలు, ఆటోల్లో ప్రయాణం కొనసాగిస్తున్నారు. ఈ రహదారిలో రాత్రి వేళల్లో ప్రయాణం చేస్తే గమ్యస్థానాలకు చేరుకుంటామో లేదోనన్న భయం వాహనదారుల్లో నెలకొంది. వర్షాకాలం పరిస్థితి మరీ దారుణం. గుంతలు తెలియక ద్విచక్ర వాహన దారులు ప్రమాదాలకు గురైన సంఘటనలు కూడా వున్నాయి. అధికారులు వెంటనే రహదారి మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. – ఉయ్యాలవాడ


