కోడుమూరు రూరల్: రానున్న ఖరీఫ్ సీజన్లో రైతులంతా భారీగా ఉల్లి పంట సాగు చేయకుండా ప్రత్యామ్నాయంగా ఇతర కూరగాయల పంటలు సాగు చేసుకోవాలని జిల్లా ఉద్యాన అధికారి రాజాకృష్ణారెడ్డి సూచించారు. బుధవారం మండలంలోని వెంకటగిరి, గోరంట్ల గ్రామాల్లో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో మిశ్రమ పంటల సాగుపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పూర్తిగా ఉల్లిపంటపై ఆధారపడకుండా మిశ్రమ పంటలను సాగు చేసుకోవాలని చెప్పారు. పత్తి, వాముతో పాటు స్వల్పకాల పంటలైన కూరగాయలు వేసుకోవాలని చెప్పారు. కోడుమూరు ఉద్యాన అధికారి మధన్మోహన్ మాట్లాడుతూ పొలాల్లో నీటినిల్వ కుంటలను ఏర్పాటు చేసుకుంటే పంటల ఉత్పాదకత మెరుగుపడుతుందన్నారు. కార్యక్రమంలో ఏఈఓ బాలక్రిష్ణ, గ్రామ ఉద్యాన సహాయకులు ఇందు, ప్రియాంక, హరిప్రసాద్, సుబ్రమణ్యం పాల్గొన్నారు.


