● తెలుగు తమ్ముళ్ల అక్రమ తవ్వకాలు
● ట్రాక్టర్ మట్టి రూ.600కు
విక్రయిస్తున్న వైనం
● చోద్యం చూస్తున్న అధికారులు
కృష్ణానదిలో జేసీబీతో అక్రమ తవ్వకాలు
ట్రాక్టర్ల ద్వారా నల్లమట్టిని తరలిస్తున్న దృశ్యం
నందికొట్కూరు: నిన్నటి వరకు ఇసుక, గ్రావెల్ అక్రమంగా తరలించి సొమ్ము చేసుకున్న తెలుగు తమ్ముళ్లు ఇప్పుడు కృష్ణానది తీరంలో మట్టిపై కన్నే శారు. ప్రకృతి వనరులను కొల్లగొట్టి జేబులు నింపుకుంటున్నారు. టీడీపీ నేతలు యథేచ్ఛగా అక్రమ తవ్వకాలకు పాల్పడుతూ దందా నడుపుతున్నా అడిగేవారు లేరు. శాతనకోట గ్రామ సమీపంలోని కృష్ణానది తీరంలో మట్టి టీడీపీ నాయకుల పాలిట నల్ల బంగారంలా మారింది. జేసీబీలతో తవ్వించి సుమారు 50 ట్రాక్టర్ల ద్వారా తరలించి అమ్ముకుంటున్నారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ తగ్గిపోవడంతో తవ్వకాలు ఊపందుకున్నా యి. గతేడాది నుంచి కొందరు టీడీపీ నేతలు మట్టి దందా నడుపుతున్నారు. ఈ ఏడాది వారం రోజుల నుంచి రోజూ తవ్వకాలు జరుపుతున్నారు. ఒక ట్రాక్టర్ ట్రిప్పు రూ. 500 నుంచి రూ. 600 చొప్పున విక్రయిస్తున్నారు. నదిలో నల్ల మట్టి ఎంతో సారవంతం కావడంతో రైతులు తమ పొలాలకు తరలించేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో జోరుగా అక్రమ తవ్వకాలు సాగుతున్నాయి. కృష్ణానదీ తీర ప్రాంతం నుంచి నందికొట్కూరు, పగిడ్యాల, జూపాడుబంగ్లా మండలాలకు నల్లమట్టిని తరలించి టీడీపీ నేతలు సొమ్ము చేసుకుంటున్నారు. అక్రమ తవ్వకాలను ప్రశ్నిస్తున్నా శాతనకోట గ్రామస్తులను కొందరు బెదిరింపులకు పాల్పడుతున్నట్లు సమాచారం. మైనింగ్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి అక్రమ తవ్వకాలను అడ్డుకోవాలని కోరుతున్నారు.


