కర్నూలు(అర్బన్): జిల్లా పరిషత్ యాజమాన్య పరిధిలోని వివిధ కార్యాలయాల్లో జూనియర్ సహాయకులు/ టైపిస్టులుగా విధులు నిర్వహిస్తున్న 13 మందికి సీనియర్ సహాయకులుగా పదోన్నతి కల్పించి పోస్టింగ్స్ ఇచ్చారు. ఈ మేరకు పదోన్నతి పొందిన వారికి జెడ్పీ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి నియామకపత్రాలను అందించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ జీవీ రమణారెడ్డి, డిప్యూటీ సీఈఓ ఈవీ సుబ్బారెడ్డి పాల్గొన్నా రు. ఈ నేపథ్యంలోనే రికార్డు అసిస్టెంట్, ఆఫీసు సబార్డినేట్ పదోన్నతులతో పాటు కారుణ్య నియామకాలను కూడా చేపడుతున్నారు.
బెట్టింగ్, మట్కాపై ఉక్కుపాదం
ప్యాపిలి: మట్కా, బెట్టింగ్, జూదంపై ఉక్కుపాదం మోపుతున్నామని ఎస్పీ సునీల్ షెరాన్ తెలిపారు. ఆన్లైన్లో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే వారి వివరాలు ఉన్నాయని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్యాపిలి పోలీస్స్టేషన్ను గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్లో రికార్డులను పరిశీలించి పెండింగ్ కేసుల వివరాలను స్థానిక పోలీసులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎస్పీ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. నాటుసారా తయారీ, విక్రయాలు, జూదం అరికట్టడంలో పోలీస్ యంత్రాంగం సమర్థవంతంగా పనిచేస్తోందన్నారు. ప్రజలకు సామాజిక, వ్యక్తిగత సమస్యలు ఉంటే స్థానిక పోలీస్స్టేషన్లను సంప్రదించాలన్నారు. ప్రజలకు పోలీసులు 24 గంటలూ అందుబాటులో ఉంటారన్నారు.
22ఏ జాబితా నుంచి భూముల తొలగింపు
కర్నూలు(సెంట్రల్): 22ఏ జాబితాలో ఉన్న భూ ములను తొలగిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చారు. ఈమేరకు గురువారం ఆమె కాన్ఫరెన్స్ హాలులో పలువురు రైతులకు 22ఏ జాబితా నుంచ తొలగించిన భూములకు సంబంధించిన పత్రాలను అందజేశారు. మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకుంటే 22ఏ జాబితాలో ఉన్న భూములను సాధారణ భూములుగా మార్చేందుకు వీలుంటుందని, ఈ విషయంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు.


