
ముందస్తుగా ఆశల ‘నైరుతి’
నంద్యాల(అర్బన్): నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది ముందస్తుగానే ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ సమాచారంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. సాధారణంగా జూన్ ఒకటిన కేరళను తాకే ‘నైరుతి’ ఈ సారి ఈ నెల 26నే తాకాయి. రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నందున ఈనెల 29 నాటికే ఉమ్మడి కర్నూలు జిల్లాలోకి ప్రవేశిస్తాయని అంచనా వేస్తున్నారు. ఏటా జూన్ రెండో వారంలో రుతుపవనాల ప్రభావంతో జిల్లాలో వర్షాలు కురిసేవి. ఈసారి దాదాపు 10 రోజులు ముందుగానే వర్ష సూచన ఉండటంతో రైతులు ఖరీఫ్ సాగుకు సన్నద్ధమవుతున్నా రు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో దాదాపు 6లక్షల హెక్టార్లలో సాగులోకి వచ్చే ఖరీఫ్ పంటలకు నైరుతి రుపవనాల ప్రభావంతో కురిసే వర్షాలే కీలకం, జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య నాలుగు నెలల పాటు వీటి ప్రభావంతో వర్షాలు నమోదవుతాయి. భారీ విస్తీర్ణంలో వరి, పత్తి, కంది, మొక్కజొన్నతో పాటు మరో 15 రకాల పంటలు సాగు చేస్తారు. అల్పపీడన ప్రభావంతో జిల్లాలో రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. నిన్నటి వరకు ఎండ వేడిమితో ఉక్కపోతతో అల్లాడిన ప్రజలు వాతావరణం చల్లబడంతో కాస్త ఊరట చెందుతున్నారు.