
బసవేశ్వరుడు విశ్వగురువు
గోస్పాడు: మహాత్మా బసవేశ్వరుడు 64 లక్షలకు పైగా ప్రవచనాలు రాసి విశ్వగురువుగా ఖ్యాతి పొందారని జిల్లా కలెక్టర్ రాజకుమారి అన్నారు. మహాత్ముని బోధనలను స్ఫూర్తిగా తీసుకుని సమాజ శ్రేయస్సు కోసం కృషి చేయాలని పేర్కొన్నారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం బసవేశ్వరుడి జయంతి కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి, డీఆర్ఓ రాము నాయక్, జిల్లా పర్యాటక అధికారి సత్యనారాయణమూర్తి, వీరశైవ సంఘం నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా విభజన తర్వాత తొలిసారి బసవేశ్వరుడి జయంతి వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు. బసవేశ్వరుడు.. 12వ శతాబ్దంలో వర్ణాంతర వివాహాలను ప్రోత్సహించారని, అన్ని కులాల వారు ఒకే చోట కూర్చుని భోజనం చేసే సంప్రదాయాన్ని తీసుకొచ్చారని గుర్తు చేశారు. దేశమంతా లింగాయత ధర్మ వ్యాప్తి కోసం కృషి చేశారన్నారు. పూజారి సాంబయ్య, అధ్యాపకులు మల్లిఖార్జున మాట్లాడారు. అనంతరం వీరశైవ సంఘం నాయకులు జిల్లా కలెక్టర్ను సన్మానించి జ్ఞాపికను అందించారు.
జిల్లా కలెక్టర్ రాజకుమారి