
ఉపాధ్యాయులు.. ఉరుకులు పరుగులు
నల్లగొండ : ఉపాధ్యాయులు ఉరుకులు.. పరుగులు పెడుతున్నారు. ప్రభుత్వం ఈ నెల 1వ తేదీనుంచి ఎఫ్ఆర్ఎస్ (ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్) యాప్ ద్వారా టీచర్ల హాజరు నమోదు చేస్తోంది. ఉదయం 9 గంటలకు.. సాయంత్రం 4.15 గంటల తర్వాత రెండు సార్లు ఎఫ్ఆర్ఎస్ యాప్లో హాజరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో మొన్నటి వరకు ఇష్టారాజ్యంగా పాఠశాలకు వెళ్లిన ఉపాధ్యాయులు ఇప్పుడు ఉదయం 9 గంటల్లోపే స్కూల్కు వెళ్తున్నారు. ఒక్క నిమిషం ఆలస్యమైన ఆన్లైన్లో అటెండెన్స్ రెడ్మార్కు చూపిస్తుండడంతో ముందుగానే పాఠశాలకు చేరుకుంటున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో విద్యార్థులకు మేలు జరుగుతుందని పలువురు పేర్కొంటున్నారు.
సాకులకు ఇక చెక్..
మొన్నటి వరకు ఉపాధ్యాయులు కొందరు పాఠశాలకు ఆలస్యంగా వెళ్లేవారు. ఒకవేళ హెచ్ఎం అడిగితే.. కొందరు ఎదురుతిరిగేవారు. మరికొందరు రాజకీయ నేతల అండతో ఇష్టమొచ్చినట్లు వ్యవహరించేవారు. దేవరకొండ, చందంపేట, డిండి తదితర దూర ప్రాంతాల ఉపాధ్యాయులైతే ఎప్పుడు వస్తారో.. ఎప్పుడు వెళ్తారో తెలియని పరిస్థితి ఉండేది. ఒక పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు ఉంటే ఒకరు ఒకరోజు.. మరొకరు ఇంకోరోజు పాఠశాలకు వెళ్లేవారు. ఇక కొందరైతే ఒకపూటే వెళ్లేవారు. సాయంత్రం 4 గంటలు కాకముందే ఇంటిబాట పట్టేవారు. బస్ల్లో ప్రయాణం చేసే వారి.. బస్లు దొరకడం లేదనే సాకుతో ముందే తోటి ఉపాధ్యాయులకు చెప్పి బడి నుంచి బయటపడే వారు. వీటన్నింటికీ ఎఫ్ఎర్ఎస్ అటెండెన్స్ యాప్ చెక్ పెట్టింది.
సెలవులూ ఆన్లైన్లోనే..
ఏ ఉపాధ్యాయుడైన తనకు సెలవు కావాలంటే గతంలో లిఖిత పూర్వకంగా లేదా మౌఖికంగా హెచ్ఎంకు చెప్పి తీసుకునేవారు. హెడ్మాస్టర్ సెలవు కాదంటే లీవ్ లెటర్ రాసి స్కూల్లో పెట్టి వెళ్లిపోయేవారు. కానీ అందుకు కాలం చెల్లింది. సెలవు కావాలనుకునే ఉపాధ్యాయుడు ఈ యాప్లోనే సెలవు పెట్టుకుంటే అది స్కూల్ హెడ్మాస్టర్కు వెళుతుంది. హెచ్ఎం దాన్ని ఆమోదిస్తేనే సెలవు తీసుకోవచ్చు. రిజక్ట్ చేస్తే కచ్చితంగా పాఠశాలకు హాజరు కావాలి. లేదంటే అతనికి ఆటోమెటిక్గా ఆబ్సెంట్ పడుతుంది.
ఫ ఎఫ్ఆర్ఎస్తో అటెండెన్స్తో
ఉదయం 9 గంటల్లోపే పాఠశాలకు
ఫ నిర్ణీత సమయం దాటితే రెడ్మార్క్
ఫ రెండు పూటలా హాజరుతో డుమ్మా కొట్టేందుకు నోచాన్స్
ఫ మంచి పరిణామం అంటున్న పలువురు టీచర్లు
ఇన్నాళ్లకు మంచి నిర్ణయం తీసుకుంది..
ప్రభుత్వం ఆలస్యంగానైనా మంచి నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా ప్రభుత్వ పాఠశాలలన్నీ మెరుగు పడతాయి. ఉపాధ్యాయులు సమయానికి పాఠశాలకు హాజరవుతారు. విద్యార్థులు కూడా సమయానికి వస్తారు. తద్వార ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ పెరిగే అవకాశం ఉంది. ఇది మంచి పరిణామం.
– రాములు, హెడ్మాస్టర్, జెడ్పీహెచ్ఎస్ నకిరేకల్
నిర్ణీత సమయం పాఠశాలలో ఉండాల్సిందే..
ఉదయం 9 గంటల్లోపు ఉపాధ్యాయులు వారు పనిచేస్తున్న పాఠశాలలకు వెళ్లి ఎఫ్ఆర్ఎస్ యాప్లో అటెండెన్స్ వేసుకోవాలి. ఆ పాఠశాల ఆవరణలో ఉండి అటెండెన్స్ వేస్తేనే వారి ఫొటో క్యాప్చర్ అవుతుంది. 9 గంటలకు ఒక్క నిమిషం దాటినా యాప్లో అటెండెన్స్ ప్రజెంట్ అని చూపించినా పక్కన రెడ్మార్కు చూపుతుంది. 9 గంటల్లోపు అయితే గ్రీన్ మార్కు చూపుతుంది. రెడ్ మార్కు చూపితే సమయానికి పాఠశాలకు హాజరు కాలేదని హైదరాబాద్ డీఎస్ఈలోనే నమోదవుతుంది. అలాగే సాయంత్రం 4.15 గంటల లోపు వెళ్లినా హాజరు తీసుకోదు. దీంతో ఉపాధాయులు పాఠశాలకు పూర్తి సమయం కేటాయిస్తున్నారు.

ఉపాధ్యాయులు.. ఉరుకులు పరుగులు