
నిలిచిన పదోన్నతుల ప్రక్రియ
నల్లగొండ : ఉపాధ్యాయ పదోన్నతుల ప్రక్రియ నిలిచిపోయింది. ఈ నెల 11వ తేదీ వరకు నిలిపివేయాలని బుధవారం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే గెజిటెడ్ హెడ్మాస్టర్, స్కూల్ అసిస్టెంట్ల పదోన్నతులకు సంబంధించి సీనియార్టి జాబితాను ప్రకటించారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి చేశారు. గెజిటెడ్ హెడ్మాస్టర్లకు సంబంధించి 56 ఖాళీలు ఉన్నాయి. అందులో రెండు పాఠశాల్లో విద్యార్థులు లేరు. ఆ రెండు పాఠశాలలు మినహా మిగిలిన వాటిని భర్తీ చేయనున్నారు. బుధవారం జీహెచ్ఎంలకు సంబంధించి వెబ్ ఆప్షన్లు తీసుకున్నారు. గురువారం వారికి పదోన్నతులు కల్పిస్తూ పోస్టింగులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 8వ తేదీన స్కూల్ అసిస్టెంట్ల పదోన్నతులు కల్పించేలా షెడ్యూల్ రచించారు. అయితే పదోన్నతులకు సంబంధించి సీనియార్టీ జాబితాను సరిచూసిన తరువాత ఈ ప్రక్రియ చేపట్టాలని కోర్టు ఆదేశిస్తూ.. వెబ్ ఆప్షన్ల ప్రకియను ఈనెల 11వ తేదీ వరకు ఆపాలని సూచించింది.
రాములబండ పీహెచ్సీ తనిఖీ
రామగిరి(నల్లగొండ) : మండలంలోని రాములబండ పీహెచ్సీని డీఎంహెచ్ఓ డాక్టర్ పుట్ల శ్రీనివాస్ బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా టీబీ ముక్త్ అభియాన్ కార్యక్రమం వివరాలు అడిగి తెలసుకున్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ వేణుగోపాల్రెడ్డి, డాక్టర్ కళ్యాణ్చక్రవర్తి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
పోస్టాఫీసులో ఖాతాదారుల ఆందోళన
రామగిరి(నల్లగొండ) : నల్లగొండ హెచ్ పోస్టాఫీసు కార్యాలయంలో ఖాతాదారులు బుధవారం ఆందోళన చేశారు. రెండు రోజులుగా సేవలు అందడం లేదని కార్యాలయం సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల దేశవ్యాప్తంగా అన్ని పోస్టాఫీసుల్లో బ్యాంకింగ్ సేవల కోసం కొత్త సాఫ్ట్వేర్ తీసుకువచ్చారు. సాఫ్ట్వేర్లో లోపాల వల్ల సరిగ్గా పని చేయడం లేదు. సేవలు అందకపోవడం వల్ల ఖాతాదారులు అసహనం వ్యక్తం చేశారు.
క్రీడలతో మానసిక ప్రశాంతత
నల్లగొండ : క్రీడలు శరీర దారుఢ్యానికి, మానసిక ప్రశాంతతకు దోహదపడతాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.నాగరాజు అన్నారు. ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కోర్టులో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రీడా పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. వృత్తి రిత్యా నిత్యం మానసిక ఒత్తిడిలో ఉండే న్యాయవాదులకు క్రీడాపోటీలు నిర్వహించడం సంతోషించదగ్గ విషయమన్నారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు సంపూర్ణ ఆనంద, కులకర్ణి, శిరీష, బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు కట్టా అనంతరెడ్డి, మంద నగేష్, న్యాయవాదులు ప్రసన్నకుమార్, కీసర శ్రీనివాస్రెడ్డి, నామిరెడ్డి శ్రీనివాస్రెడ్డి, వెంకట్రెడ్డి, నాంపల్లి నరసింహ, నాంపల్లి భాగ్య, కూకుంట్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు.
మూసీ ప్రాజెక్టుకు
కొనసాగుతున్న వరద
కేతేపల్లి : మూసీ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద ఉధృతి కొనసాగుతోంది. మూసీ రిజర్వాయర్కు ఎగువ నుంచి 2030 క్యూసెక్కుల నీరు వస్తుండగా ప్రాజెక్టు అధికారులు రెండు క్రస్ట్గేట్లను రెండు అడుగుల మేర పైకెత్తి 1,276 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టులో గరిష్ట నీటిమట్టం 645 అడుగులు (4.46 టీఎంసీలు)కాగా.. 643 అడుగుల (3.94 టీఎంసీలు)మేర నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు కుడి, ఎడమ ప్రధాన కాల్వల ద్వారా ఆయకట్టుకు 404 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. సీపేజీ, లీకేజీ, ఆవిరి రూపంలో 62 క్యూసెక్కుల నీరు వృథా అవుతోందని ప్రాజెక్టు ఏఈ మధు తెలిపారు.

నిలిచిన పదోన్నతుల ప్రక్రియ