రెండు రోజులు అలర్ట్‌! | - | Sakshi
Sakshi News home page

రెండు రోజులు అలర్ట్‌!

May 4 2025 6:21 AM | Updated on May 4 2025 6:21 AM

రెండు రోజులు అలర్ట్‌!

రెండు రోజులు అలర్ట్‌!

సాక్షి ప్రతినిధి, నల్లగొండ : వచ్చే రెండు రోజుల పాటు నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో వాతావరణ పరిస్థితులు మారనున్నాయి. ప్రస్తుతం గరిష్ట ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటిపోయయి. ఎండల తీవ్రత పెరగడంతోపాటు.. వచ్చే రెండు రోజులు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, పగటి వేలల్లో బయటకు రావద్దని కలెక్టర్‌ ఇలా త్రిపాఠి సూచించారు. వైద్యారోగ్య శాఖను అప్రమత్తం చేశారు.

మార్చిలోనే మొదలైన ఎండలు

ఉమ్మడి జిల్లాలో ఎండల తీవ్రత పెరుగుతోంది. మార్చిలోనే మొదలైన ఎండలు ఏప్రిల్‌ చివరి నాటికి అధికమయ్యాయి. ప్రస్తుతం గరిష్ట ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పులు ఉండవని, అయితే ఆది, సోమవారం తర్వాత ఎండలు కాస్త తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

మధ్యాహ్నం వేళ బయటకు రావొద్దు

ఎండల తీవ్రత నేపథ్యంలో ప్రజలు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు రాకుండా ఉండటమే మంచిదని కలెక్టర్‌ ఇలా త్రిపాఠి ప్రజలకు సూచించారు. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు రావాల్సి వస్తే టోపీ ధరించడం, తలకు తువాలు చుట్టుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని, నీడ ప్రదేశాల్లో మాత్రమే ఉండాలని, ఎక్కువ మోతాదులో మంచినీరు, మజ్జిగ, పండ్ల రసాల వంటి ద్రవ పదార్థాలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారుల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. వ్యాపార, వాణిజ్య సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, కార్మికులు ఎండ తీవ్రతతో వడదెబ్బకు గురికాకుండా తగిన జాగ్రత్తలు చేసుకోవాలని చెప్పారు.

ఉపాధి కూలీలు ఉదయమే పని చేయాలి

ఉపాధి కూలీలు ఉదయం వేళల్లో పనిచేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదేశించారు. పని ప్రదేశంలో షామియానాలు ఏర్పాటు చేసుకోవాలని, తాగునీరు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, వడదెబ్బ నివారణ ఔషధాలు సరిపడా అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. చర్మంపై ఎర్రటి దద్దుర్లు, చర్మం పొడిబారడం లాంటివి గమనించాలని, శరీరంలో అధిక ఉష్ణోగ్రత, అలసట, నోరు ఎండిపోవడం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, వాంతులు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే సమీప ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకోవాలని ప్రజలకు సూచించారు.

ఫ ఇప్పటికే 43 డిగ్రీలు దాటిన పగటి ఉష్ణోగ్రతలు

ఫ రానున్న రెండు రోజులు మరింత పెరగనున్న ఎండల తీవ్రత

ఫ ఉరుములు, మెరుపులతో వర్షాలు కూడా కురుస్తాయంటున్న వాతావరణ శాఖ

ఫ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్న కలెక్టర్‌

శనివారం ఉష్ణోగ్రత 43 డిగ్రీలు దాటిన గ్రామాలు ఇవే

మండలం గ్రామం ఉష్ణోగ్రత

దామరచర్ల దామరచర్ల 43.8

మాడుగులపల్లి మాడుగులపల్లి 43.7

దామరచర్ల తిమ్మాపూర్‌ 43.6

మిర్యాలగూడ టేక్యాతండా 43.4

త్రిపురారం మాటూరు 43.3

అడవిదేవులపల్లి ముల్కచర్ల 43.2

నార్కట్‌పల్లి నార్కట్‌పల్లి 43

తిరుమలగిరిసాగర్‌ తిరుమలగిరిసాగర్‌ 43

మోతె మామిళ్లగూడెం 43.1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement