రామగిరి(నల్లగొండ): పాలిసెట్–2025 దరఖాస్తు చేసుకునేందుకు గడువు పొడిగించాలని పాలిటెక్నిక్ ఎస్సీ, ఎస్టీ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.శ్రీనివాస్ కోరారు. పాలిసెట్ దరఖాస్తులకు లేట్ ఫీజుతో ఏప్రిల్ 21 చివరి తేదీ గా నిర్ణయించి.. టెన్త్ ఫలితాలు ఇటీవలే విడుదలవడంతో విద్యార్థులు అయోమయంలో ఉన్నారని పేర్కొన్నారు. మే 13న ఎంట్రెన్స్ ఉన్నందున గడువు పొడిగించి మరింతమంది విద్యార్థులు పరీక్ష రాసేలా చూడాలని అధికారులను కోరారు.
20వరకు ప్రక్రియ పూర్తి
కాంగ్రెస్ పార్టీ జిల్లా సంస్థాగత ఎన్నికల ప్రక్రియను సమన్వయకర్తలు ఈ నెల 20వ తేదీ వరకు పూర్తిచేయాల్సి ఉంది. గ్రామ కమిటీలు, మండల కమిటీలతోపాటు బ్లాక్ కమిటీలను కూడా.. సమావేశాలు నిర్వహించి జాబితాలను టీపీసీసీకి పంపించాల్సి ఉంటుంది. ఈసారి పార్టీ విధేయులకే పదవులు దక్కుతాయని టీపీసీసీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
ఎల్కతుర్తి సభతో కాంగ్రెస్ నేతల్లో వణుకు: మాజీ మంత్రి జగదీశ్రెడ్డి
నల్లగొండ టూటౌన్: వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించిన బీఆర్ఎస్ సభ విజయవంతం కావడంతో కాంగ్రెస్ నేతల్లో వణుకు పుడుతుందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. గురువారం నల్లగొండలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి నివాసంలో మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యమైందన్నారు. శాసనసభ నిబంధనలను గాలికి వదిలేసి బూతులు మాట్లాడిన చరిత్ర కాంగ్రెస్ పాలకులకే దక్కిందన్నారు. గత పదేళ్లలో ఉమ్మడి జిల్లాలో జరిగిన అభివృద్ధిపై ప్రజల్లోనే చర్చకు పెడుదామని, మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డిలకు దమ్ముంటే ముందుకు రావాలని సవాల్ విసిరారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్రెడ్డి, ఎన్.భాస్కర్రావు తదితరులు ఉన్నారు.