
బరిసె మెడపై కోసుకుపోయి వ్యక్తి దుర్మరణం
దంతాలపల్లి: ప్రమాదవశాత్తు పామాయిల్ చెట్టును చెక్కే బరిసె గొంతుకు కోసుకుపోయి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలంలో గురువారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం ఏనకుంటతండా గ్రామానికి చెందిన బానోత్ రమేశ్(40) తన భార్య సునీతతో కలిసి గురువారం ద్విచక్ర వాహనంపై మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం పెద్దముప్పారం వచ్చారు. ఆ గ్రామానికి చెందిన పెల్లి దామోదర్రెడ్డి తన పామాయిల్ తోటలో పనిచేయడానికి బరిసెను పదును పెట్టించుకుని ద్విచక్ర వాహనంపై పెట్టుకుని ఇంటికి తీసుకెళ్తున్నాడు. గ్రామ సమీపంలో రెండు బైక్లు ఎదురుపడ్డాయి. ఎదురుగా వస్తున్న రమేశ్(40) గొంతుకు బరిసె కోసుకుపోవడంతో బైక్ పైనుంచి పడిపోయాడు. తీవ్ర రక్తస్రావమైంది. స్థానికులు 108 అంబులెన్స్కు సమాచారం అందించగా.. వారు ఘటనా స్థలానికి చేరుకుని రమేశ్ అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. రమేశ్కు ఇద్దరు కుమార్తెలు దీప్తి, దీపిక ఉన్నారు.
మృతదేహంతో ఆందోళన
రమేశ్ మృతి విషయం తెలుసుకున్న తండావాసులు మృతదేహాన్ని దామోదర్రెడ్డి ఇంటి ఎదుట ఉంచి ఆందోళన చేపట్టారు. తొర్రూరు సీఐ గణేష్, దంతాలపల్లి ఎస్ఐ, నర్సింహులపేట ఎస్ఐ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.