కొత్త పనులు చేపట్టే దమ్ములేదు
నల్లగొండ టూటౌన్ : నల్లగొండకు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రులు.. కేసీఆర్ పూర్తి చేసిన అభివృద్ధి పనులను ప్రారంభించారు కానీ, కొత్త పనులకు శంకుస్థాపన చేసే దమ్ము లేదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. ఆదివారం నల్లగొండలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సొంతంగా పనులు చేసే దమ్ము మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్కు లేదన్నారు. దేశంలో అతి పెద్దదైన యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టును కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిందన్నారు. కేసీఆర్ ముందుచూపుతో 2027 నాటికి 24 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తికి చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుని పని చేసిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే శని అని, కాంగ్రెస్ హయాంలోనే ఫ్లోరైడ్ మహమ్మారి విజృంభించగా కేసీఆర్ భగీరథ నీటితో దాన్ని రూపుమాపారని తెలిపారు. జిల్లా మంత్రి బ్రాహ్మణవెల్లెంల – ఉదయ సముద్రం ఎత్తిపోతల ప్రాజెక్టు తమ ప్రభుత్వ హయాంలోనే ట్రయల్ రన్ చేసి నీరు ఎత్తిపోశామన్నారు. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం ఆలస్యానికి కాంగ్రెస్ నాయకులే కారణమన్నారు. రైతులకు రూ.30 వేల కోట్లు ఎగ్గొట్టి కేవలం రూ.12 వేల కోట్లు రుణమాఫీ చేశారన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్రెడ్డి, ఎన్.భాస్కర్రావు, చిరుమర్తి లింగయ్య, కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, నాయకులు బండా నరేందర్రెడ్డి, మందడి సైదిరెడ్డి, కటికం సత్తయ్యగౌడ్, నిరంజన్ వలి, రేగట్టె మల్లికార్జున్రెడ్డి, మాలే శరణ్యారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఫ యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్
కేసీఆర్ కలల ప్రాజెక్టు
ఫ మాజీ మంత్రి జగదీశ్రెడ్డి


