వీపనగండ్ల: సింగోటం–గోపల్దిన్నె లింక్ కెనాల్ పనుల్లో వేగం పెంచి త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర ఎకై ్సజ్శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. బుధవారం మండలంలోని బొల్లారం గ్రామంలో భూ సేకరణపై రైతులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రస్తుత రెవెన్యూ రికార్డుల విలువ కంటే మూడింతల ధరను భూములు కోల్పోయిన రైతులకు పరిహారంగా చెల్లిస్తామని.. అందుకు అవసరమైన నివేదికలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. లింక్ కెనాల్ నిర్మాణం పూర్తయితే వీపనగండ్ల, చిన్నంబావి, కోడేరు మండలాల్లోని 40 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని వివరించారు. ప్రభుత్వ భూములున్న రైతులకు కూడా పూర్తిస్థాయి పరిహారం అందిస్తామని తెలిపారు. భూ సేకరణ సత్వరమే పూర్తిచేసి సాగునీరు అందేవిధంగా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. సమావేశంలో జిల్లా భూ సేకరణ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ తిరుపతయ్య, ఇరిగేషన్ సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్రీనివాస్రెడ్డి, ఆర్డీఓ సుబ్రహ్మణ్యం, సర్పంచ్లు సుదర్శన్రెడ్డి, రామన్గౌడ్, కాంగ్రెస్పార్టీ సీనియర్ నాయకులు నారాయణరెడ్డి, చిన్నారెడ్డి, పలువురు రైతులు పాల్గొన్నారు.


