
మళ్లీ ఆత్మా కమిటీలు
కార్యవర్గంలో రైతుల, అధికారులకు చోటు
నాగర్కర్నూల్: రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి మరో అడుగు ముందుకేసింది. గతంలో రైతులకు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన ఆత్మా (వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ) కమిటీల ఏర్పాటును మరోమారు తెరపైకి తెచ్చింది. గతంలో ఈ కమిటీలున్నా ప్రభుత్వాలు నిధులు మంజూరు చేయకపోవడంతో రైతులకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదు. ఈసారి కమిటీలు ఏర్పాటు చేసి రైతులకు ఆధునిక సాగుపై సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు. ఇందుకోసం ఇప్పటికే వ్యవసాయ అధికారులు ఏర్పాట్లు చేస్తుండగా.. త్వరలో పూర్తిస్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు అందజేయనున్నారు.
గతంలో ఇలా..
వ్యవసాయరంగంలో యంత్ర పరికరాల వినియోగం పెంచేందుకు 2001లో అప్పటి ప్రభుత్వం వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మ) పథకానికి శ్రీకారం చుట్టింది. ప్రతి వ్యవసాయ డివిజన్ను బ్లాక్గా పరిగణించి రైతులు, అధికారులతో సలహా కమిటీని ఏర్పాటు చేశారు. యువజన సంఘాలు, మహిళా మండలి సభ్యులు, ఎరువుల దుకాణాల డీలర్లు తదితరుల భాగస్వామ్యంతో 20 నుంచి 24 మంది సభ్యులతో కార్యవర్గం ఏర్పాటైంది. ఇందులో ఏడీఏ కన్వీనర్గా మిగతా వారు సభ్యులుగా వ్యవహరించారు. డివిజన్ కమిటీల నుంచి ఇద్దరు, ముగ్గురిని తీసుకొని జిల్లా రైతు సలహా కమిటీని ఏర్పాటు చేశారు. రైతులకు ఆధునిక సాగు సలహాలు అందించేందుకు అవసరమయ్యే శిక్షణలు, క్షేత్రస్థాయి పర్యటనలు, విజ్ఞాన యాత్రలు నిర్వహించాల్సి ఉంది. ఏటా అధికారులు ప్రతిపాదనలు పంపినా.. నిధులు మాత్రం అరకొరగానే మంజూరయ్యాయి. 2019–20 ఆర్థిక సంవత్సరం తర్వాత నిధులు విడుదల కాకపోవడంతో చేసేదేమీ లేక మిన్నకుండిపోయారు.
28 మంది సభ్యులతో కార్యవర్గం..
మొదట నియోజకవర్గ కమిటీలను ఏర్పాటు చేసి తరువాత జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకోనున్నారు. నియోజకవర్గ, జిల్లా కమిటీల్లో 28 మందికి అవకాశం ఉండగా.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా రైతులకు ప్రాధాన్యం కల్పిస్తారు. కార్యవర్గంలో వ్యవసాయ, పశుసంవర్ధక, ఉద్యాన, సెరీకల్చర్, విత్తన డీలర్లు, యువజన సంఘాల నుంచి ఒకరు, శాస్త్రవేత్తలకు చోటు కల్పించనున్నారు. కార్యవర్గాల ఏర్పాటుకుగాను ఇప్పటికే వ్యవసాయ అధికారులు ప్రక్రియ ప్రారంభించగా.. త్వరలోనే పూర్తిచేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపనున్నారు.
జిల్లా, నియోజకవర్గస్థాయిలో ఏర్పాటుకు సన్నాహాలు
ఒక్కో కమిటీలో
28 మందికి అవకాశం
త్వరగా పూర్తిచేసేలా
వ్యవసాయశాఖ కసరత్తు
త్వరలో ఏర్పాటు చేస్తాం..
ఆత్మా కమిటీల ఏర్పాటు విషయమై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. 28 మంది సభ్యులతో మొదట నియోజకవర్గ కమిటీ, తర్వాత జిల్లా కమిటీని ఏర్పాటుచేసి ప్రభుత్వానికి నివేదికలు అందజేస్తాం. ఈ కమిటీలు రైతులకు సాగులో మెళకువలు, సాంకేతికత వినియోగం వంటి అంశాలపై సలహాలు సూచనలు ఇస్తారు.
– చంద్రశేఖర్, డీఏఓ, నాగర్కర్నూల్

మళ్లీ ఆత్మా కమిటీలు