ములుగు రూరల్: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ మహేందర్ అన్నారు. శుక్రవారం తన చాంబర్లో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణపై జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ ఇంటర్ థియరీ పరీక్షలు ఈ నెల 13 నుంచి 21వ తేదీ వరకు, ప్రాక్టికల్ పరీక్షలు 22 నుంచి 25వ తేదీ వరకు జరగనున్నట్లు తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేసి పరీక్షల విజయవంతంగా నిర్వహించాలన్నారు. పరీక్షల నిర్వహణకు జిల్లాలో 7 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని, ఆయా కేంద్రాల వద్ద తాగునీరు, విద్యుత్, వైద్య సదుపాయాలు, బందోబస్తు, ఆర్టీసీ బస్సు సౌకర్యం, పోస్టల్ సేవలు తదితర ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మొదటి సంవత్సరం ఇంటర్ జనరల్ విభాగంలో 1,050 మంది, ఒకేషనల్ విభాగంలో 39 మంది, ద్వితీయ సంవత్సరం జనరల్ విభాగంలో 227 మంది, ఒకేషనల్ విభాగంలో 19 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఐఈఓ నాయిని వీరేందర్ తదితరులు ఉన్నారు.


