భూపాలపల్లి అర్బన్: సీపీఎస్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టీపీటీఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నన్నెబోయిన తిరుపతి, రాష్ట్ర కార్యదర్శి రావుల రమేశ్ డిమాండ్ చేశారు. జిల్లాకేంద్రంలో సంఘం జిల్లా అధ్యక్షుడు బానోత్ సేవానాయక్ అధ్యక్షతన శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతి, రమేశ్ మాట్లాడారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) ఉద్యోగుల భవిష్యత్ భద్రతకు ముప్పుగా మారిందన్నారు. ఎన్నికల హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సీపీఎస్ను రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ ఉద్యోగుల డీఏ బకాయిలను వెంటనే వారి ఖాతాల్లో జమ చేయాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర కౌన్సిలర్ ముత్యాల రఘుపతి, నాయకులు అన్నారెడ్డి, పెద్దన్న, నరేష్ పాల్గొన్నారు.


