మున్సిపాలిటీ సమాచారం
ములుగు రూరల్: ములుగు మున్సిపాలిటీ పరిధిలోని పలు కాలనీల్లో తాగునీటి సరఫరా లేక ప్రజలు తండ్లాడుతున్నారు. పలు వార్డుల్లో పైప్లైన్లు లేకపోవడంతో నల్లా నీళ్లు ఎరుగని కాలనీలు ఉన్నాయి. తాగునీటికి భగీరథ నీరు రాకపోవడంతో ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ మినరల్ వాటర్ కొనుగోలు చేస్తూ అవసరాలు తీర్చుకుంటున్నారు. మున్సిపాలిటీ పరిధిలో నూతనంగా ఏర్పడిన కాలనీల్లో మంచినీటి సరఫరాకు అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. దీంతో కాలనీవాసులు తాగునీటికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాగునీటి సరఫరా లేకపోయినా.. అధికారులు ఇంటి పన్ను వసూలు చేస్తున్నారని ప్రజలు వాపోతున్నారు.
భగీరథ పైప్లైన్ లేని కాలనీలు
మున్సిపాలిటీ పరిధిలో 12 సంవత్సరాల క్రితం ఇళ్లు ఏర్పాటు చేసుకుని నివస్తున్నా.. పలు కాలనీల్లో భగీరథ పైప్లైన్ లేకపోవడం గమనార్హం. గత ప్రభుత్వం ప్రతీ గ్రామానికి, కాలనీకి భగీరథ పైప్ లైన్ ఏర్పాటు చేసి తాగునీటిని అందించారు. అయి తే ములుగు మున్సిపాలిటీలోని పలు కాలనీల్లో మాత్రం భగీరథ పైప్లైన్ ఏర్పాటు చేయలేదని పట్టణ వాసులు ఆరోపిస్తున్నారు. గతంలో చేపట్టిన మిషన్ భగీరథ కాంట్రాక్టర్ పూర్తి స్థాయిలో నల్లా పైప్లైన్లు నిర్మించకపోవడంతోనే ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పైప్లైన్ లేదని, తాగునీరు రావడం లేదని పలుమార్లు ఫిర్యాదు చేసినా.. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. ముఖ్యంగా జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న కృష్ణకాలనీ, మంజునాథపురం కాలనీల్లో నేటికీ భగీరథ పైప్లైన్ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
పలు కాలనీల్లో మిషన్ భగీరథ
పైప్లైన్ లేని వైనం
ఇబ్బందులు పడుతున్న పట్టణవాసులు
సరఫరా లేకపోయినా..పన్ను వసూలు!
వార్డులు: 20
జనాభా: 22,000
గృహాలు: 6,600
భగీరథ నల్లా కలెక్షన్లు : 10,000


