వెంకటాపురం(ఎం): శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం (రామప్ప దేవాలయం) ఆధ్వర్యంలో 2026–27 సంవత్సరానికి సంబంధించి దేవస్థానం తరి భూములను రెండు పంటల కౌలు హక్కుల కోసం శుక్రవారం ఆలయ ఈఓ ఇమ్మడి భాస్కర్ ఆధ్వర్యంలో బహిరంగ వేలం నిర్వహించారు. దేవస్థానం ప్రాంగణంలో ఉదయం 11 గంటలకు జరిగిన వేలంలో పలువురు రైతులు పాల్గొన్నారు. రామానుజపూర్ శివారు లక్ష్మీదేవిపేట పరిధిలోని 9–09 ఎకరాల భూమిని రూ.1.40లక్షలు, పాలంపేట గార్లగడ్డ పరిధిలోని 3–11 ఎకరాల భూమి రూ.1,10,000లకు, వెంకటాపూర్ శివారులోని 2–02 ఎకరాల భూమి రూ.32,500లకు కౌలు కుదిరినట్లు అధికారులు తెలిపారు. గోవిందరావుపేట, రామానుజపూర్, బుద్దారం గ్రామాలకు చెందిన కొన్ని భూములు వేలంపాటకు రైతులు హాజరుకాకపోవడంతో వాటిని వాయిదా వేసినట్లు ఈఓ భాస్కర్ తెలిపారు. గత సంవత్సరంతో పోలిస్తే రూ.44,500 అదనపు ఆదాయం వచ్చినట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పర్యవేక్షణ అధికారి బిల్లా శ్రీనివాస్, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.


