ములుగు రూరల్: బ్యాంక్ లింకేజీ రుణాలు ఇవ్వడంలో రాష్ట్రస్థాయిలో జిల్లా మూడో స్థానంలో నిలిచింది. కృషి చేసిన నలుగురు అధికారులకు గురువారం మంత్రి సీతక్క బెస్ట్ పర్ఫామెన్స్ అవార్డులు అందజేశారు. ఈ మేరకు హైదరాబాద్లోని ప్రజాభవన్లో బెస్ట్ పర్ఫామెన్స్ అవార్డులను డీఆర్డీఓ చంద్రశేఖర్, ఏపీడీ శ్రీనివాస్, బ్యాంక్ లింకేజీ డీపీఎం శ్రీనివాస్, గట్టమ్మ జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు పద్మలు సీతక్క చేతుల మీదుగా అవార్డులను అందుకున్నారు.
జాగ్రత్తలు తప్పనిసరి
వెంకటాపురం(కె): గృహ విద్యుత్ పరికరాలు వినియోగించే సమయంలో జాగ్రత్తలు తప్పరిసరి పాటించాలని విద్యుత్శాఖ ఏడీఏ ఉమారావు తెలిపారు. మండల పరిధిలోని పాత్రాపురంలో విద్యుత్శాఖ ఆధ్వర్యంలో రైతు వారం కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీఎం సోలార్ కూసుమ్, పీఎం సూర్య ఘర్ పథకాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా భద్రతా వారోత్సవాల సేఫ్టీ కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏఈ హనుమాన్ దాస్, మండల వ్యవసాయ అధికారి నవీన్, సర్పంచ్ బొగ్గుల పుష్పవతి, సబ్ ఇంజనీర్ సూర్య కుమార్ పాల్గొన్నారు.
ఉచిత సమ్మర్ శిక్షణ శిబిరం
వెంకటాపురం(కె): మండల కేంద్రంలోని కాపెడ్ స్వచ్ఛంద సేవా సంస్థ క్రీడా మైదానంలో జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో తైక్వాండో, కరాటే, యోగాలో ఉచిత సమ్మర్ శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కరాటే మాస్టర్స్ హనుమంతు, సూర్యనారాయణ తెలిపారు. ఈ మేరకు మండల కేంద్రంలో గురువారం సమావేశం నిర్వహించి సమ్మర్ ఉచిత శిక్షణ శిబిరం పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాయం నాగేశ్వర్రావు, ఎట్టి బాబురావు, నారాయణమ్మ, రమాదేవి, సంతోష్, కృష్ణబాబు తదితరులు పాల్గొన్నారు.
నేడు జగ్గన్నపేటలో ప్రజాదర్బార్
ములుగు రూరల్: నేడు ములుగు మండల పరిధిలోని జగ్గన్నపేటలో నిర్వహించనున్న ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కలెక్టర్ హేమంత్ సహదేవరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. నేడు(శుక్రవారం) సాయంత్రం 4 గంటలకు మంత్రి సీతక్క హాజరుకానున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎంపీయూపీఎస్ పాఠశాలలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
అనుమానం వస్తే
సమాచారం ఇవ్వండి
కాళేశ్వరం: లాడ్జిల్లోకి అనుమానాస్పద వ్యక్తులు వచ్చినా, అనుమానం వచ్చిన వారి గురించి పోలీసులకు సమాచారం ఇవ్వాలని లాడ్జ్ నిర్వాహకులను కాటారం డీఎస్పీ సూర్యనారాయణ ఆదేశించారు. గురువారం కాళేశ్వరం పోలీస్స్టేషన్ పరిధిలోని లాడ్జ్ యజమానులతో డీఎస్పీ సమావేశం నిర్వహించి పలు ఆదేశాలు జారీ చేశారు. నిర్వాహకులు కస్టమర్ల పూర్తి వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు. ఏ పని నిమిత్తం వచ్చారో కూడా తెలుసుకోవాలని సూచించారు. లాడ్జ్లో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి అవి సక్రమంగా పనిచేసేలా చూసుకోవాలని.. రిజిస్టర్, సీసీ కెమెరా పుటేజీలను అవసరమైనప్పుడు పోలీసులకు అందుబాటులో ఉంచాలని తెలిపారు.
వన్యప్రాణులను
రక్షించుకోవాలి
మల్హర్(కాటారం): వన్యప్రాణుల రక్షణకు ప్రతీ ఒక్కరు బాధ్యత తీసుకోవాలని కాటారం రేంజ్ అధికారి స్వాతి అన్నారు. గురువారం మండలంలోని బొప్పారం, ప్రతాపగిరి గ్రామాల్లో రేంజర్ స్వాతి, సిబ్బందితో కలిసి వన్యప్రాణుల సంరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అటవీ ప్రాంతంలో వన్యప్రాణులను వేటాడినా, హాని కలిగించినా, హతమార్చేందుకు ఉచ్చులు బిగించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అడవువుల్లో అగ్ని ప్రమాదాలు జరకుండా చూసుకోవాలని చెప్పారు.


