● రాష్ట్ర పంచాయతీరాజ్,
గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క
● కొండాయి, చిన్నబోయినపల్లిలో
ప్రజాదర్బార్కు హాజరైన మంత్రి
ములుగు/ములుగు రూరల్/ఏటూరునాగారం/గోవిందరావుపేట: గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్, సీ్త్ర శిశు సంక్షేమ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఏటూరునాగారం మండల పరిధిలోని కొండాయి, చిన్నబోయినపల్లిలో ప్రజాదర్భార్ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి హాజరై ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. వెంటనే పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను మంత్రి ఆదేశించారు. అనంతరం సీతక్క మాట్లాడుతూ గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకే ప్రజాదర్బార్ కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు. అందుకోసమని 99 రోజుల ప్రజాపాలన కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. పేదల సమస్యలను సత్వరం పరిష్కరించడమే ప్రజా ప్రభుత్వం ఎజెండాగా పెట్టుకుందన్నారు. కొండాయి గ్రామంలో అర్హులైన 115 మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తూ పత్రాలను అందజేసినట్లు తెలిపారు. అనంతరం జిల్లాలోని ఎంసీసీ కేంద్రాలకు స్వచ్ఛభారత్ మిషన్ కింద పది కంప్యూటర్లు, స్కానర్, ప్రింటర్లను మంత్రి సీతక్క అందజేశారు. అలాగే వివిధ గ్రామాలకు చెందిన 11 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మీ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం పదో తరగతి ఫలితాల్లో జిల్లా మొదటి ర్యాంకు సాధించిన కోరంకున్నత్ కృష్ణను మంత్రి సీతక్క శాలువాతో సత్కరించి అభినందించారు. అలాగే చిన్నబోయినపల్లిలో 11కేవీ విద్యుత్ ఉప కేంద్రాన్ని ప్రారంభించారు. కొండాయి–దొడ్ల గ్రామాల మధ్యలోని జంపన్నవాగుపై హైలెవల్ వంతెన పనులను అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు మహేందర్జీ, సంపత్రావు, గ్రంథాలయ చైర్మన్ బానోత్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణి, ఆర్డీఓ వెంకటేశ్, సర్పంచులు మానస, నాగార్జున, రాజు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇర్సవడ్ల వెంకన్న, గుడ్ల దేవేందర్, రవి, రఘు, లాలయ్య, ఎల్లయ్య, పాల్గొన్నారు. అదే విధంగా గోవిందరావుపేట మండల కేంద్రంలోని సబ్ మార్కెట్ యార్డులో ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా రైతు వారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి హాజరై మాట్లాడారు. రైతులకు రుణమాఫీ చేపట్టి పెట్టుబడికి రైతుభరోసా ఇస్తున్నామని తెలిపారు. వ్యవసాయ యంత్రాలపై ప్రత్యేక సబ్సిడీలు అందిస్తున్నామని తెలిపారు. అలాగే ములుగు మండల పరిధిలోని జాకారంలో రూ.3.76 కోట్లతో నిర్మించిన 11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాన్ని మంత్రి సీతక్క ప్రారంభించి మాట్లాడారు. జిల్లాలో రూ.41 కోట్లతో 12 విద్యుత్ ఉప కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. రూ.41 కోట్ల నిధులతో విద్యుత్ ఉప కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే జిల్లాలో 3 ఉప కేంద్రాలు వినియోగంలోకి తీసుకొచ్చినట్లు వెల్లడించారు.


