● ఇరిగేషన్ డీఈఈ గోపాల కృష్ణ
వాజేడు: చెరువుల పరిరక్షణకు పూడికతీత పనులు చేపడుతున్నట్లు ఇరిగేషన్ డీఈఈ జె.గోపాల కృష్ణ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మంగళవారం మండల కేంద్రంలోని ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ డీఈఈ గోపాలకృష్ణ, ఎంపీడీఓ శ్రీకాంత్ నాయుడులు మాట్లాడారు. చెరువుల్లో మట్టితీత పనులను చేపట్టినట్లు తెలిపారు. రైతులు తమ సొంత ఖర్చులతో పూడికతీత తీయించి మట్టిని తమ వ్యవసాయ భూములకు తరలించుకోవడానికి అనుమతి ఇస్తున్నట్లు వివరించారు. ఆసక్తి కలిగిన రైతులు పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు జిరాక్స్లతో భద్రాచలం నీటి పారుదల శాఖ అధికారులకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. పూడికతీత మట్టి రైతులకు ఉచితంగానే ఇవ్వనున్నట్లు వెల్లడించారు. కమర్షియల్ అవసరాల కోసం వినియోగించాలనుకునే వారు తగిన రుసుముతో డీడీ రూపంలో చెల్లించిన తరువాతే అనుమతి ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈఈ సాయి, దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


