
15 మంది విద్యార్థులకు అడ్మిషన్
ఏటూరునాగారం: మండల కేంద్రంలోని ఎంపీపీఎస్ నార్త్ ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు 15 మంది బుధవారం అడ్మిషన్లు పొందారు. ఈ మేరకు ప్రధానోపాధ్యాయుడు పోతు రాజశేఖర్ తెలిపారు. కొన్ని సంవత్సరాలుగా నార్త్ పాఠశాలలో ఉపాధ్యాయులు ఇంగ్లిష్ మీడియంలో నాణ్యమైన విద్య బోధిస్తున్నారని, విషయం తెలుసుకొని పిల్లలను చేర్పించినట్లు చెప్పారు. ప్రధాన రహదారి నుంచి రెండున్నర కిలోమీటర్ల దూరంలో బడి ఉన్నప్పటికీ ఆటో అద్దెకు మాట్లాడుకుని బడికి పంపించడం అభినందనీయమన్నారు. పాఠశాల అభివృద్ధికి సహకరిస్తామని తల్లిదండ్రులు హామీ ఇవ్వడం గమనార్హం. కార్యక్రమంలో రమాదేవి, వరలక్ష్మి, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.