
మూడు నెలల బియ్యం పంపిణీ
ములుగు: జూన్ నెలలో ఒకేసారి మూడు నెలల సన్నబియ్యం లబ్ధిదారులకు పంపిణీ చేయాలని అదనపు కలెక్టర్ మహేందర్జీ అధికారులకు సూచించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన బియ్యం కోటాను ఒకేసారి జూన్లోనే పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ సన్న బియ్యం పంపిణీలో ఎలాంటి జాప్యం లేకుండా చేయకూడదని రవాణా కాంట్రాక్టర్లకు సూచించారు. డీలర్లు కూడా మూడు నెలల బియ్యం తీసుకోవడానికి వచ్చిన ప్రతీ లబ్ధిదారుడి వేలిముద్ర మూడుసార్లు నమోదు చేయించి పంపిణీ చేయాలని ఆదేశించారు. మండల్ లెవెల్ స్టాక్ పాయింట్ ఇన్చార్జ్లు హమాలీలను సరిపడా ఉంచుకోవాలని సూచించారు. ప్రజలందరూ మూడు నెలల సన్నబియ్యాన్ని తప్పకుండా తీసుకోవాలని సూచించారు. జిల్లాలోని పౌరసరఫరాల శాఖ అధికారులు, తహసీల్దార్లు, సివిల్ సప్లయీస్ డీటీలు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు నిరంతరం బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి సయ్యద్ షా పైసల్ హుస్సేన్, పౌరసరఫరాల శాఖ మేనేజర్ రాంపతి, ఏటూరునాగారం డివిజనల్ మేనేజర్ వాని ఠాగూర్, వెంకటాపురం జీసీసీ మేనేజర్ స్వామి, ములుగు, ఏటూరునాగారం డిప్యూటీ తహసీల్దార్లు, మండల లెవల్ స్టాక్ పాయింట్, గోదాం ఇన్చార్జ్లు, మండలాల డీలర్ల సంఘం అధ్యక్షులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ మహేందర్జీ