
పేరూరు ఎస్సైకి గ్యాలంటరీ అవార్డు
వాజేడు: మండల పరిధిలోని పేరూరు పోలీస్ స్టేషన్లో ఎస్సైగా పని చేస్తున్న గుర్రం కృష్ణ ప్రసాద్ సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా గ్యాలంటరీ అవార్డు అందుకున్నారు. ఏజెన్సీలో ఆయన చేస్తున్న, చేసిన సేవలకు గాను అవార్డును ప్రదానం చేశారు.
ఇంటర్నెట్ కేబుల్స్
సరిచేసుకోవాలి
ములుగు రూరల్: విద్యుత్ స్తంభాల పైనుంచి తీసుకెళ్లిన ఇంటర్నెట్ కేబుల్స్ సరిచేసుకోవాలని విద్యుత్వాఖ డీఈ నాగేశ్వర్రావు తెలిపారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలో కేబుల్ ఆపరేట్లతో ఆయన సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ ఇంటర్నెట్, టీవి కేబుల్స్ ఇష్టారాజ్యంగా వేలాడ తీయడంతో విద్యుత్ మరమ్మతుల సమయంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. కేబుల్ ఆపరేటర్లు తమ పరిధిలో వినియోగిస్తున్న విద్యుత్ స్తంభాల లెక్క అప్పగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్శాఖ ఏడీఏ వేణుగోపాల్, ఆయా మండలాల ఏఈలు, కేబుల్ ఆపరేటర్లు పాల్గొన్నారు.
భూములు స్వాధీనం
చేసుకోవడం సరికాదు
ములుగు రూరల్: ఇరవై ఏళ్లుగా అసైన్డ్ భూములను సాగు చేసుకుంటున్న రైతుల నుంచి భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం సరికాదని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి జంపాల రవీందర్ అన్నారు. ఈ మేరకు సోమవారం ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూములను రైతుసంఘం నాయకులతో కలిసి సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజల సమస్యలు పరిష్కరించలేని పాలకులు ఆవిర్భావ వేడుకలు నిర్వహించడం వల్ల పేదలకు ఒరిగేది ఏమిలేదన్నారు. ఇంచర్ల శివారు గట్టమ్మ ప్రాంతంలో సర్వే నంబర్ 18 నుంచి 55 వరకు సుమారు 150 ఎకరాలకు గతంలో ప్రభుత్వం పట్టాలు అందించగా రెవెన్యూ అధికారులు మాత్రం భూములను స్వాధీనం చేసుకోవడం వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రభుత్వం భూములు స్వాధీనం చేసుకునే క్రమంలో భూసేకరణ చట్టం 2013 ప్రకారం భూమికి సమానమైన భూమి కేటాయించడం లేదా పరిహారం చెల్లించడం చేయాలని వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎండి అమ్జద్పాషా, రైతులు హరినాధ్ గౌడ్, రాజన్న, విజేందర్, తదితరులు పాల్గొన్నారు.
నేటి నుంచి
రెవెన్యూ సదస్సులు
వెంకటాపురం(కె): మండలంలోని 18 పంచాయతీల్లో నేటి నుంచి 13వ తేదీ వరకు భూభారతి చట్టంలో భాగంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించ నున్నట్లు తహసీల్దార్ వేణుగోపాల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. నేడు మరికాల, బెస్తగూడెం, 4న చిరుతపల్లి, రాచపల్లిలో, 5వ తేదీన బీసీ మర్రిగూడెం, వెంకటాపురంలో, 6న వీఆర్కేపురం, ఉప్పేడు, వీరాపురం, 9వ తేదీన నూగూరు, పాత్రాపురంలో 10న వీరభద్రవరం, తిప్పాపురంలో, 11న రామచంద్రాపురం, మొర్రవానిగూడెంలో, 12న బోదాపురం, ఆలుబాకలో, 13 వ తేదీన సూరవీడు, ఎదిరలో రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
‘గ్రంథాలయ చైర్మన్గా ఆదివాసీలను నియమించాలి’
వెంకటాపురం(కె): జిల్లా గ్రంథాలయ చైర్మన్గా ఆదివాసీలను నియమించాలని గొండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆదివాసీలు ఓట్ల సమయంలో మాత్రమే గుర్తుకు వస్తారు తప్ప పదవులు విషయంలో గుర్తుకు రారా అని ప్రశ్నించారు. జిల్లాలో గ్రంథాలయ చైర్మన్ పదవి ఇచ్చేందుకు ఒక్క ఆదివాసీ కూడా కనపడలేదా అని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం చేసిన పొరపాట్లనే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.