
వ్యాధులురాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
ఎస్ఎస్తాడ్వాయి: వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల బారిన పడకుండా జాగ్రతలు తీసుకోవాలని డీఎంహెచ్ఓ అల్లెం అప్పయ్య అన్నారు. మండల పరిధిలోని లవ్వాల స్టేజీ సమీపంలో గల జలగలంచ గొత్తికోయ గూడెంలో తాడ్వాయి పీహెచ్సీ వైద్యాధికారి చిరంజీవి, సిబ్బంది శనివారం వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి గొత్తికోయలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ శిబిరాన్ని డీఎంహెచ్ఓ అప్పయ్య సందర్శించి గూడెంలో జ్వరాలపై ఆరా తీశారు. ఇంటింటికీ తిరిగి పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు. మురుగుగుంతలను పూడ్చివేయాలని ఆదివాసీ గొత్తికోయలకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల నివారణకు ముందస్తుగా వైద్య సేవలందిస్తున్నామని తెలిపారు. మలేరియా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు తెలిపారు. వ్యాధుల బారిన పడిన వారు ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చి వైద్యం చేయించుకోవాలన్నారు. సీజనల్ వ్యాధుల ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పరిశుభ్రత చర్యలపై అవగాహన కల్పించారు. డీఎంహెచ్ఓ అప్పయ్య స్వయంగా గొత్తికోయ పిల్లల నుంచి రక్తనమునాలను సేకరించారు. మలేరియా మాస్ స్క్రీనింగ్ కార్యక్రమంలో భాగంగా మొండ్యాల తోగుగూడెంలో 77మంది నుంచి రక్తనమునాలను సేకరించినట్లు వైద్యాధికారి చిరంజీవి తెలిపారు. ఈ వైద్య శిబిరంలో డీపీఎంఓ సంజీవరావు, ఏఎన్ఎం మంగ, ఆశ వర్కర్ పాల్గొన్నారు.
డీఎంహెచ్ఓ అల్లెం అప్పయ్య