
ఆకులవారిఘణపురం సబ్సెంటర్లో సర్వే బృందం
ఏటూరునాగారం: కుష్ఠువ్యాధి నిర్మూలనకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు డీపీఎంఓ వెంకటేశ్వచారి అన్నారు. జిల్లా వైద్యాధికారి అప్పయ్య, ప్రోగ్రాం అధికారి డాక్టర్ రవీందర్ సూచనల మేరకు మంగళవారం తాడ్వాయి, ఏటూరునాగారంలోని రొయ్యూర్ సబ్సెంటర్ల వారీగా సర్వే చేపట్టారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరచారి మాట్లాడుతూ హైదరాబాద్ నుంచి వచ్చిన వైద్య బృందం శాంపిల్ సర్వే, అసెస్మెంట్ యూనిట్ కుష్ఠ్టువ్యాధి కేసులపై ఆరా తీసి ప్రజలకు అవగాహన కల్పించినట్లు తెలిపారు. ఈ నెల 31వ తేదీ వరకు, వచ్చే నెల 3నుంచి 23వ తేదీ వరకు జిల్లాలో కుష్ఠు వ్యాధిగ్రస్తులను గుర్తించనున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 246 అనుమానిత కేసులను గుర్తించామన్నారు. ఎన్ఎల్ఈపీ రికార్డులను పరిశీలించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీఎంఓలు జోసెఫ్, సురేందర్, శ్రీనివాసరెడ్డి, తాడ్వాయి వైద్యాధికారి రణధీర్, డీపీఎంఓ సాంబయ్య, సంజీవరావు, వైద్యులు, సిబ్బంది, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.