‘వారణాసి’ షూటింగ్కు నీటి ట్యాంకర్ల డిమాండ్
వాణిజ్యావసరాల కంటే ప్రజల దాహార్తికే ప్రాధాన్యం
దర్శకుడు రాజమౌళి అభ్యర్థనను తిరస్కరించిన జలమండలి
వేసవిలో గొంతెండుతున్న సామాన్యుడి దాహార్తి తీర్చడం అవసరమా? సినిమా షూటింగ్ కోసం నీటి సరఫరాకు ప్రాధాన్యమా? ఈ రెంటి మధ్య తలెత్తిన ప్రాధాన్యతా అంశంలో జలమండలి సామాన్యుడి పక్షాన నిల్చుంది. దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి భారీ బడ్జెట్ చిత్రం ‘వారణాసి’ షూటింగ్ కోసం కోరిన నీటి సరఫరాను జలమండలి నిర్ద్వంద్వంగా తిరస్కరించింది.
అండర్ వాటర్ షూట్.. 150 ట్యాంకర్లు
మహేష్ బాబు, ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రల్లో భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న చిత్రం ‘వారణాసి’. ఈ సినిమాలోని కీలకమైన అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్స్ కోసం గగన్పహాడ్ పరిసరాల్లో భారీ కొలను నిర్మించారు. దీనిని నింపడానికి దాదాపు 150 ట్యాంకర్ల (సుమారు 15 లక్షల లీటర్లు) శుద్ధి చేసిన జలం కావాలని జలమండలికి లేఖ రాశారు. మే 18న జరగబోయే ఈ షూటింగ్ కోసం అవసరమైన వ్యయాన్ని భరిస్తామని ప్రతిపాదించారు. వాణిజ్య ప్రయోజనాల కోసం ఇంత భారీ మొత్తంలో నీటిని మళ్లించడం భావ్యం కాదని జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ కె. అశోక్ రెడ్డి తేల్చిచెప్పారు. నీరు ఇవ్వడం సాధ్యపడదని స్పష్టం చేశారు.


