భారతీయ ఇతిహాసం ‘రామాయణం’ ఆధారంగా రూపొందుతున్న హిందీ చిత్రం ‘రామాయణ’. నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రాముడిగా రణ్బీర్ కపూర్, సీతగా సాయిపల్లవి, లక్ష్మణుడిగా రవి దుబే, హనుమంతుడిగా సన్నీ డియోల్, రావణుడిగా యశ్ నటిస్తున్నారు. ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, డీఎన్ఈజీ సంస్థ, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ పతాకాలపై భారీ బడ్జెట్తో నమిత్ మల్హోత్రా ఈ సినిమాను రెండు భాగాలుగా నిర్మిస్తున్నారు.
తొలి భాగాన్ని ఈ ఏడాది దీపావళికి, రెండో భాగాన్ని వచ్చే ఏడాది దీపావళికి రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ఆల్రెడీ ప్రకటించారు. కాగా శుక్రవారం (మార్చి 27) శ్రీరామ నవమి పండగ సందర్భంగా ఓ అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్రం నుంచి ‘రామ’ గ్లింప్స్ను హనుమాన్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 2న విడుదల చేయనున్నట్లుగా నమిత్ మల్హోత్రా తెలిపారు. ‘‘రామాయణం మన అందరికీ చెందిన కథ.
‘రామాయణ’ చిత్రాన్ని నిజమైన స్ఫూర్తితో, అత్యంత చిత్తశుద్ధితో తెరపైకి తీసుకురావడానికి మేము వేసే ప్రతి అడుగుకూ అపారమైన బాధ్యత, భక్తి శ్రద్ధలే మార్గదర్శకాలుగా నిలుస్తున్నాయి. కొన్నేళ్లుగా మేం చేసిన కృషిని ఫ్యాన్స్తో కలిసి ప్రపంచవ్యాప్తంగా ఒక గ్రాండ్ ఈవెంట్ ద్వారా ప్రదర్శించనున్నాం. ఆ క్షణాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్నవారందరూ కలిసి సెలబ్రేట్ చేసుకుందాం’’ అని నమిత్ మల్హోత్రా ‘ఎక్స్’లో షేర్ చేశారు. అయితే ‘రామ’ గ్లింప్స్ లాంచ్ ఈవెంట్ అమెరికాలో జరగనుందని బాలీవుడ్ టాక్. ఈ చిత్రానికి సంగీతం: ఏఆర్ రెహమాన్, హాన్స్ జిమ్మర్.


