సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ఉదయ్పూర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నిర్మాత ఆర్బీ చౌదరి దుర్మరణం చెందారు. ఆయన దాదాపు 90కి పైగా సినిమాలు నిర్మించారు. ఆయన సూపర్ గుడ్ ఫిల్మ్స్ అనే బ్యానర్ స్థాపించారు. పలు భాషల్లో సినిమాలు నిర్మించి అగ్ర నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో స్టార్ హీరోలతో కలిసి సూపర్ హిట్ సినిమాలు నిర్మించారు. ఆయన మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవితో పాటు పలువురు హీరోలు సంతాపం ప్రకటించారు.
ఆర్బీ చౌదరి ప్రస్థానం..
రాజస్థానీ కుటుంబానికి ఆర్బీ చౌదరి పూర్తి పేరు రతన్లాల్ భగత్రామ్ చౌదరి. ఆయన మొదట ఉక్కు, ఎగుమతులు, ఆభరణాల పరిశ్రమలలో పనిచేశారు. ఆ తర్వాత కొన్నేళ్లకు మలయాళ సినీ ఇండస్ట్రీలో నిర్మాతగా అడుగుపెట్టారు. సూపర్ పేరుతో బ్యానర్ ప్రారంభించి సినిమాలు నిర్మించారు. ఆ తర్వాత 1989లో తమిళ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు.
గుడ్ నైట్తో భాగస్వామ్యం..
గుడ్ నైట్ అనే దోమల నివారణ మ్యాట్లను తయారు చేసే ఆర్ మోహన్ను తన భాగస్వామిగా చేర్చుకున్నారు. ఇద్దరు కలిసి సూపర్ బ్యానర్లోనే సినిమాలు నిర్మించారు. ఆ తర్వాత ఇద్దరు విడిపోయే సమయంలో గుడ్ నైట్ అనే బ్రాండ్లోని గుడ్ అనే పదాన్ని తీసుకుని సూపర్ గుడ్ ఫిల్మ్స్గా పేరు మార్చేశారు. ఆ తర్వాత ఇదే పేరుతో చిత్రాలు నిర్మించారు ఆర్బీ చౌదరి. మలయాళంతో పాటు తమిళ, తెలుగు, హిందీ భాషల్లోనూ దాదాపు 90కి పైగా సినిమాలు నిర్మించారు. తెలుగులో చివరిసారిగా మెగాస్టార్ నటించిన గాడ్ ఫాదర్ మూవీకి నిర్మాతగా వ్యవహరించారు.
స్వతహాగా రాజస్థానీ అయిన ఆర్బీ చౌదరి తమిళ్ అయిన మహజబీన్ను వివాహం చేసుకున్నారు. ఆయనకు నలుగురు కుమారులు ఉన్నారు. ఆయన కుమారుడు సురేష్ వారి సొంత నిర్మాణ సంస్థ అయిన 'సూపర్ గుడ్ ఫిల్మ్స్' కోసం చిత్రాలను నిర్మిస్తున్నారు. మరో కుమారుడు జీవన్ ఒక స్టీల్ కంపెనీని నడుపుతున్నారు. మూడో కుమారుడు జితన్ రమేష్ నటుడిగా రాణిస్తున్నారు. ఆయన చిన్న కుమారుడు జీవా హీరోగా చాలా సినిమాలు చేశారు. జీవా రంగం మూవీతో తెలుగులోనూ క్రేజ్ తెచ్చుకున్నారు. జీవాకు టాలీవుడ్లోనూ ఫ్యాన్స్ ఉన్నారు. జీవ తెలుగు, తమిళ భాషల్లో ఫేమస్ అయ్యారు.


