ఒమన్లో ఇబ్బందులు పడ్డ మహిళను రక్షించినట్లు పవన్ కల్యాణ్ చేసిన ట్వీట్పై నటి పూనమ్ కౌర్ స్పందించారు. సోషల్ మీడియాలో కనిపించే హంగులను నమ్మొద్దని, ఇవన్నీ ప్రజల దృష్టిని మళ్లించడానికే అంటూ ఆమె విమర్శించారు. అంతేకాదు ముందుగా సుగాలి ప్రీతి తల్లికి ఇచ్చిన మాటను నెరవేర్చి చూపించాలంటూ పవన్ కల్యాణ్కి చురకలు అంటించారు.
ఒమన్లో చిక్కుకుని ఇబ్బందులు ఎదుర్కొన్న అన్నమయ్య జిల్లాకు చెందిన ఓ మహిళను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహాయంతో సురక్షితంగా భారతదేశానికి తిరిగి తీసుకొచ్చామంటూ పవన్ కల్యాణ్ తన ఎక్స్ ఖాతాలో ఓ సుధీర్ఘమైన పోస్ట్ పెట్టాడు.
‘అన్నమయ్య జిల్లా వాయల్పాడుకు చెందిన శ్రీమతి షానవాజ్, ఒమన్లో ఎదుర్కొంటున్న తీవ్ర ఇబ్బందుల నుండి తనను రక్షించాలని, భారతదేశానికి తిరిగి వచ్చేలా సహాయం చేయాలని కోరుతూ కొద్దిరోజుల క్రితం ఒక హృదయపూర్వక వీడియోను పంచుకున్నారు. ఈ విషయం నా దృష్టికి వచ్చిన వెంటనే, ఆమె క్షేమంగా తిరిగి రావడం కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని నేను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను కోరాను. వారు వెంటనే స్పందించారు. ఆమెను సురక్షితంగా మన మాతృభూమికి చేర్చడంలో సహకరించిన భారత రాయబార కార్యాలయ అధికారులు, ఒమన్ అధికారులకు కూడా నా ధన్యవాదాలు. వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’ అంటూ పవన్ ఎక్స్లో రాసుకొచ్చాడు.
ఈ ట్వీట్పై పూనమ్ ఇలా స్పందించారు. ‘సోషల్ మీడియాలో చెప్పిన మాటల్లో దేన్నీ నమ్మకండి. సుగాలి ప్రీతి తల్లికి ఇచ్చిన మాటను నెరవేర్చాలి. ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఈ విజువల్ హంగులు కేవలం ప్రజల దృష్టి మరల్చడానికే. ఒకవేళ నిజంగానే సహాయం చేస్తే మంచిదే' అని పూనమ్ కౌర్ పోస్ట్ చేశారు. పవన్ కల్యాణ్ ట్వీట్ పై పూనమ్ ఇలా డైరెక్ట్ ఎటాక్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పలువురు నెటిజన్స్ ఆమెకు మద్దతు తెలుపుతూ కామెంట్స్ పెడుతున్నారు.
Don’t believe in anything spoken just on social media - a promise given to sugali Preeti’s mother needs to be fulfilled and much more - these visual spectacles are just to divert .good if done .
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) May 9, 2026


