
బిగ్బాస్ 9వ సీజన్లో సామాన్యుల ఎంట్రీ ఉండబోతోంది. కానీ ఆ సామన్యులెవరన్నది తేల్చేందుకు అగ్నిపరీక్ష (Bigg Boss Agnipariksha) షో మొదలుపెట్టారు. ఇందులో 45 మంది పాల్గొననున్నారు. సామాన్యుల కలను నెరవేర్చడానికే ఈ అగ్నిపరీక్ష అంటూ తొలి ఎపిసోడ్ జియో హాట్స్టార్లో రిలీజ్ చేశారు. మరి ఎపిసోడ్లో ఏం జరిగిందో చూసేద్దాం..
రెడ్ ఫ్లాగ్ ఇచ్చారంటే ఎలిమినేట్
అగ్నిపరీక్ష స్టేజీపై వచ్చిన సామాన్యులకు బిగ్బాస్ షోలో ఉండే అర్హత ఉందా? లేదా? అన్నది జడ్జిలు నవదీప్, అభిజిత్, బిందుమాధవి తేల్చనున్నారు. ఏ కంటెస్టెంట్కైనా వీరు ముగ్గురూ రెడ్ ఫ్లాగ్ ఇచ్చారంటే మాత్రం అతడు/ఆమె నేరుగా ఎలిమినేట్ అయినట్లు లెక్క! మొదటగా విజయవాడ నుంచి దివ్య నిఖిత నైటీలో వచ్చింది. ఈమె ఎంబీబీఎస్ చదువుతోంది. ఒక సాయిపల్లవి, ఒక శ్రీలీల.. ఒక దివ్య నిఖితలా అందరికీ గుర్తుండిపోవాలన్నదే తన కోరిక అంది.
డేర్ అండ్ డాషింగ్
అభిజిత్ను నామినేట్ చేయమని టాస్క్ ఇవ్వగా.. ఒకే ఒక మైండ్ టాస్క్ ఆడి గెలిచావు. ఎప్పుడూ సోఫాలోనే కూర్చుంటూ గేమ్ కంటే కూడా వేరేవాళ్లమీదే ఫోకస్ పెట్టావు. నీ ఆట నాకు నచ్చలేదు. గేమ్పై ఫోకస్ లేని నిన్ను నామినేట్ చేస్తానంటూ ధైర్యంగా మాట్లాడింది. తర్వాత నాన్న గురించి చెప్తూ ఎమోషనలైంది. ఆమెకు ముగ్గురు జడ్జిలు గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చారు.
మాస్క్ మ్యాన్ ఎంట్రీ
తర్వాత మాస్క్ మ్యాన్ ఎంట్రీ ఇచ్చాడు. ఏడేళ్లుగా మాస్క్ వేసుకునే తిరుగుతున్నట్లు చెప్పాడు. ఇతడి పేరు హృదయ్ మానవ్ అని తెలిపాడు. తిక్కగా మాట్లాడుతున్న అతడి వైఖరి నచ్చిక అభిజిత్ రెడ్ ఫ్లాగ్ ఇవ్వడంతో మానవ్ హర్టయ్యాడు. నన్ను చూడగానే జడ్జి చేస్తున్నారు.. బిగ్బాస్ కోసం ఈ మాస్క్ వేసుకోలేదన్నాడు. గత మూడు సీజన్ల నుంచి మంచి కంటెస్టెంట్లే రాలేదు, అందుకే నేనొచ్చానని తన గురించి తాను ఓవర్గా చెప్పుకున్నాడు.
పెద్దావిడకు ఛాన్సిచ్చిన అభిజిత్
దీంతో బిందుమాధవి.. మాస్క్ మ్యాన్కు లూజర్ అనే బోర్డు వేసింది. అయినా అతడు వెనక్కు తగ్గలేదు, జడ్జిలపై ఫైర్ అయ్యాడు. సరే, నీగురించి ఇంకాస్త తెలుసుకోవాలంటూ నవదీప్ ఒక్కడే.. అతడికి గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చాడు. మూడో కంటెస్టెంట్గా.. ముసలి వయసులో ఉన్న కేతమ్మ వచ్చింది. తనకు ఛాన్సిద్దామని అభిజిత్ ఒక్కడే గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చాడు. నాలుగో కంటెస్టెంట్గా ప్రియా శెట్టి వచ్చింది. ముఖంలోనే కాకుండా తన మాటల్లోనూ క్యూట్నెస్ ఉంది. ఆమెకు అభిజిత్ మినహా ఇద్దరు జడ్జిలు గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చారు.
మల్టీ స్టార్ మన్మధ రాజాకు ఝలక్
ఐదో కంటెస్టెంట్గా మల్టీ స్టార్ మన్మధ రాజా వచ్చాడు. బిగ్బాస్లో ఛాన్స్ కోసం నిరాహార దీక్ష చేశానన్నాడు. తనకు ఆస్తులు లేవు, అయినవారు లేరంటూ ఏడుస్తూ సింపతీ పొందే ప్రయత్నం చేశాడు. సింపతీకి చోటు లేదంటూ జడ్జిలు అతడిని బయటకు పంపించేశారు. ఆరో కంటెస్టెంట్గా సయ్యద్ అబూ వచ్చాడు. నవదీప్ ఒక్కడే గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చాడు. ఏడో కంటెస్టెంట్గా దివ్యాంగుడు ప్రసన్నకుమార్ వచ్చాడు. ఒంటికాలుతోనే మారథాన్ చేసినట్లు తెలిపాడు. అతడి టాలెంట్కు అందరూ ఫిదా అయ్యారు. జడ్జిలు ముగ్గురూ గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చారు. గ్రీన్ ఫ్లాగ్ వచ్చిన కంటెస్టెంట్లు నెక్స్ట్ రౌండ్కు వెళ్తారు.
చదవండి: వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్.. చిరుకు అల్లు అర్జున్ బర్త్డే విషెస్