ఫ్రాన్స్లో జరుగుతున్న కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ దేశ, విదేశీ తారల తళుకులతో కనువిందుగా సాగుతోంది. మంగళవారం ఆరంభమైన ఈ ఫెస్టివల్ ఈ నెల 23తో ముగుస్తుంది. తొలి రోజు రెడ్ కార్పెట్పై పీచ్ కలర్ ఫ్రాక్లో తళుకులీనారు ఆలియా భట్. అయితే ఆలియా చేసిన కొన్ని వ్యాఖ్యలు విమర్శలకు దారి తీశాయి.
‘‘సినిమాల్లో లీడ్ రోల్స్లో ఎవరు నటిస్తారు? అనేది ప్రేక్షకులు చూడరు. వాళ్లకి కథ ముఖ్యం’’ అని పేర్కొనడంతో పాటు ఆలియా ఈ ఫెస్టివల్లో ఇంకా మాట్లాడుతూ – ‘‘బార్బీ’లాంటి మహిళా ప్రాధాన్యం ఉన్న చిత్రాలకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ లభిస్తోంది. అయితే భారత్లో మాత్రం 75 శాతం సినిమాలు మాస్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకునే రూపొందిస్తారు. అవన్నీ హీరో ప్రాధాన్యంగా సాగే సినిమాలే. అలాంటి సినిమాలు తీయొద్దని అనడంలేదు.
కానీ మహిళల కోసమూ సినిమాలు తీయాలి కదా. మహిళా ప్రేక్షకులకు కావాల్సిన సినిమాలు ఎవరు తీస్తారు? ఎందుకంటే సినిమాలు ఒక వర్గానికి మాత్రమే కాదు. అందరి కోసం తీయాలి’’ అన్నారు. సినిమా పరిశ్రమలో పురుషాధిక్యతను ఉద్దేశించి ఆలియా ఈ వ్యాఖ్యలు చేశారని ఊహించవచ్చు. అయితే రెడ్ కార్పెట్పై ఆలియా అందానికి ప్రశంసలు కురిపించిన పలువురు నెటిజన్లు ఈ వ్యాఖ్యలను మాత్రం విమర్శిస్తున్నారు.
‘‘ఒకవైపు భర్త (రణ్బీర్ కపూర్) ‘యానిమల్’ లాంటి వయొలెంట్ సినిమాలో నటించాడు. ఆ సినిమాలో హింస ఎక్కువగా ఉందని విమర్శలు వచ్చినా ‘యానిమల్’ని సమర్థించింది. అలాగే ‘ధురంధర్’ సినిమా గురించి కూడా పెదవి విప్పలేదు. అలాంటి ఆలియా కాన్స్లో మహిళల కోసం సినిమాలు రావాలని మాట్లాడటం ఎందుకు?’’ అంటూ విమర్శించారు.
నేను ఊర్వశిని కాదు... భారతదేశాన్ని!
‘‘నా దేశం తరపున ప్రాతినిధ్యం వహించిన ప్రతిసారీ ‘నేను ఊర్వశిని కాదు... భారతదేశాన్ని! కాన్స్ ఫెస్టివల్ ప్రారంభ వేడుకలో నా భారతదేశం తరఫున నేను ప్రాతినిధ్యం వహించడం నాకు చాలా ఆనందంగా ఉంది. వియత్నాంకు చెందిన ఫ్యాషల్ లేబుల్ జోలీపొలీ కోచర్ డిజైన్ చేసిన ఈ బ్యూటిఫుల్ గౌనుని ధరించాను’’ అని ఊర్వశీ రౌతేలా పేర్కొన్నారు.


