యంత్రాలు ఇవే..
రాయితీ యంత్రాల అందజేత జిల్లావ్యాప్తంగా 422 మందికి లబ్ధి ఏడాదిలో రూ.1.80 కోట్లు ఖర్చు
బ్యాటరీ/మ్యాన్వల్ స్పైయర్లు 14, బుష్ కట్టర్ 31, కేజ్వీల్స్ 2, కల్టివేటర్స్ 112, డ్రోన్స్ 6, ఎంబీ ప్లవ్స్ 3, పవర్ స్పైయర్స్ 133, పవర్ టిల్లర్స్ 8, పవర్ వీడర్స్ 8, రోటోపుడ్లర్ 1, రోటోవేటర్స్ 50, స్ట్రా బెలర్ 54 కలిపి మొత్తం 422 యంత్రాలను రైతులకు అందజేశారు.
మెదక్ కలెక్టరేట్: రోజు రోజుకు పెరుగుతున్న కూలీల కొరత, సాంకేతికత నేపథ్యంలో జిల్లాలోని రైతులు యాంత్రీకరణ వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వం సైతం ప్రోత్సహిస్తూ సబ్సిడీ యంత్రాలు అందజేస్తుంది. ఇందులో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరం జిల్లాలోని 422 మంది రైతులకు రూ.1.80 కోట్ల విలువైన యంత్రాలను అందజేసింది. ప్రస్తుతం ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’లో భాగంగా రైతులను యాంత్రీకరణ వైపు మళ్లించేందుకు చైతన్య కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వ్యవసాయ అధికారులు తెలిపారు.
నర్సాపూర్లో అత్యధికంగా..
జిల్లాలో మొత్తం 21 మండలాలు ఉండగా, నర్సాపూర్ మండలం నుంచి అత్యధికంగా 103 మంది రైతులు యంత్రాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. మెదక్ మండలం మొత్తం మీద ఒకే ఒక్క దరఖాస్తు రావడం గమనార్హం. కాగా రైతులను యాంత్రీకరణ వైపు ప్రోత్సహించడంలో భాగంగా ప్రభుత్వం అన్నివర్గాల రైతులకు సబ్సిడీ అందజేస్తుంది. అయితే ఇందులో ఎస్సీ, ఎస్టీ, మహిళా రైతులకు 50 శాతం, ఓసీ, పెద్ద రైతులకు 40 శాతం రాయితీపై యంత్రాలు అందజేస్తుంది. జిల్లాలోని 21 మండలాల నుంచి 422 మంది రైతులు వివిధ రకాల యంత్రాల కోసం దరఖాస్తు చేసుకోగా, వారికి రూ.1.80 కోట్ల విలువైన యంత్రాలను అందజేసింది.
యాంత్రీకరణ వైపు రైతులు
అవగాహన కల్పిస్తున్నాం
పెరుగుతున్న సాంకేతికతతో పాటు రైతులంతా యాంత్రీకరణ ద్వారా అత్యధికంగా పంటలు పండించేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మండల వ్యవసాయ, ఇతర అధికారుల ద్వారా ఎప్పటికప్పుడు రైతులతో సమావేశాలు నిర్వహించి ప్రోత్సహిస్తున్నాం. యంత్రాల కోసం దరఖాస్తు చేసుకున్న రైతులందరికీ సబ్సిడీపై అందజేస్తాం. – దేవ్కుమార్, డీఏఓ


