కలెక్టర్ ప్రతిమాసింగ్
నిజాంపేట(మెదక్): ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’లో భాగంగా జిల్లాలోని అన్ని గ్రామాల్లో ‘అరైవ్– అలైవ్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈమేరకు సోమవారం మండల పరిధిలోని నందగోకుల్లో నిర్వహించిన గ్రామసభలో ‘నో హెల్మెట్.. నో ఎంట్రీ’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ముఖ్య అతిథిగా కలెక్టర్ ప్రతిమాసింగ్, ఎస్పీ శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజలందరూ నందగోకుల్ గ్రామా న్ని ఆదర్శంగా తీసుకొని, నో హెల్మెట్– నో ఎంట్రీ కార్యక్రమన్ని చేపట్టాలని సూచించారు. ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన వ్యక్తి క్షేమంగా ఇంటికి తిరిగి రావాలంటే ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు తప్పనిసరిగా పాటించాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రతి ఒక్కరి పాత్ర అత్యంత కీలకమన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం సేవించి వాహనం నడపకూడదని సూచించారు. ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. జిల్లాలో హత్యలు, అత్యాచారాలు 30 జరిగితే.. రోడ్డు ప్రమాదాల ద్వారా 350 మరణాలు జరిగాయని అందోళన వ్యక్తం చేశాడు. రోడ్డు భద్రత నియమాలు పాటించకపోవడం, మద్యం సేవించి వాహనాలు నడపడం, సీటు బెల్టు పెట్టుకోకపోవడం తదితర కారణాల వల్ల చాలా మంది మృత్యువాత పడుతూ కుటుంబాలకు దూరమవుతున్నారని తెలిపారు. అనంతరం రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో డీఎస్పీ నరేందర్గౌడ్, తహసీల్దార్ శ్రీనివాస్, మండల ప్రత్యేక అధికారి దేవకుమార్, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు పాతూరు భానుప్రసాద్రెడ్డి, ఎంపీడీఓ రాజిరెడ్డి, సీఐ వెంకటరాజాగౌడ్, పోలీస్ యంత్రాంగం తదితరులు పాల్గొన్నారు.


