● మంత్రి దామోదర రాజనర్సింహ ● సింగూరు మరమ్మతు పనుల పరిశీలన
పుల్కల్(అందోల్): సింగూర్ ప్రాజెక్టు మరమ్మతు పనుల్లో వేగం పెంచాలని మంత్రి దామోదర రాజనర్సింహ ఇంజనీర్లను ఆదేశించారు. మండలంలోని సింగూర్ ప్రాజెక్టు మరమ్మతు పనులను సోమవారం నేషనల్ డ్యామ్ అధికారులతో కలిసి పరిశీలించారు. పనుల్లో జాప్యంపై అధికారుల నుంచి వివరణ తీసుకున్నారు. డ్యాం కట్ట రివిట్మెంట్ను, కాలువ సిమెంట్ లైనింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు సూచించారు. అతిథిగృహంలో అధికారులతో ఇంజనీర్లతో జరుగుతున్న పనులపై సమీక్షించారు. ప్రస్తుతం డ్యామ్లో ఏడు టీఎంసీల నీళ్లు ఉండటంతో పనుల్లో ఆలస్యమవుతుందని అధికారులు, ఇసుక సమస్య ఉందని, కేటాయించిన క్వారీల్లో ఇసుక తక్కువగా ఉందని కాంట్రాక్టర్లు మంత్రి దృష్టికి తెచ్చారు. డ్యామ్లో నీళ్లు తగ్గుతున్న కొద్దీ పనుల్లో వేగం పెంచుతామని అధికారులు మంత్రికి వివరించారు. ఇసుక సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని డీఆర్ఓ పాండుకు మంత్రి సూచించారు. నీటి పారుదల శాఖ ఎస్సీ కలిసి సింగూర్ ప్రాజెక్టు కట్ట పనులను, కాల్వ పనులను, సిమెంట్ లైనింగ్ను పరిశీలించారు. మరమ్మతు పనులు త్వరగా పూర్తి చేసి సాగు,తాగు నీటికి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సాగు, తాగుకు బసపూరం శివారులో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ను మంత్రి పరిశీలించారు. కార్యక్రమంలో నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు దుర్గారెడ్డి, రామచంద్రారెడ్డి, లక్ష్మారెడ్డి, మంత్రి పీఏ హనుమంతుతోపాటు తదితరులు పాల్గొన్నారు.


