అదనపు కలెక్టర్ నగేశ్
చిన్నశంకరంపేట(మెదక్): ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ నగేశ్ అన్నారు. శుక్రవారం మండలంలోని జంగరాయిలో నిర్మాణంలో ఉన్న ఇళ్లను పరిశీలించారు. గ్రామంలో చాలా వరకు బేస్మెంట్ వరకు మాత్రమే పనులు జరిగాయని, వెంటనే పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని హౌసింగ్ పీడీ మాణిక్యంను ఆదేశించారు. ఇందిరమ్మ బిల్లుల చెల్లింపులో నిర్లక్ష్యం వద్దని సూచించారు. లబ్ధిదారుల ఇబ్బందులు తెలుసుకొని పనులు పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం ప్రాథమిక పాఠశాలను సందర్శించి ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. బడికి వచ్చిన తర్వాత మొబైల్ పక్కనపెట్టాలని, విద్యార్థులను తీర్చిదిద్దడంపైనే దృష్టి సారించాలన్నారు. అలాగే పంచాయతీ కార్యాలయంలో రికార్డులను పరిశీలించడంతో పాటు గవ్వలపల్లి ఫర్టిలైజర్ దుకాణంలో తనిఖీలు నిర్వహించారు. ఆయన వెంట తహసీల్దార్ మాలతి, ఎంపీడీఓ దామోదర్, ఆర్ఐ రాజు, గ్రామ కార్యదర్శి శైలజ ఉన్నారు.


