దూషించిన టీచర్‌ను దండించాలి | - | Sakshi
Sakshi News home page

దూషించిన టీచర్‌ను దండించాలి

Apr 8 2026 7:44 AM | Updated on Apr 8 2026 7:44 AM

కౌడిపల్లి(నర్సాపూర్‌): విద్యార్థులను కొట్టి, దూషించిన ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవడంలో అధికారులు నిర్లక్ష్యంగా వహిస్తున్నారని, అతన్ని సస్పెండ్‌ చేసేవరకు పరీక్ష రాయమని విద్యార్థులు ధర్నాకు దిగారు. ఈ సంఘటన మండల కేంద్రమైన కౌడిపల్లిలో మంగళవారం జరిగింది. ఎస్టీ గురుకుల పాఠశాల జాతీయ రహదారి పక్కన ఉంది. గత వారం గురుకుల పాఠశాలలో డౌట్లు అడిగిన విద్యార్థులను ఉపాధ్యాయుడు ఉదయ్‌ కొట్టడంతోపాటు దూషించారు. ఈ విషయం అధికారులకు చెప్పినా ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని విద్యార్థులు ఆరోపించారు. భోజనం సైతం నాణ్యతగా లేదన్నారు. గురుకులంలో వసతులు సరిగా లేవన్నారు. దీంతో విద్యార్థులు రోడ్డుపై బైఠాయించారు. ఉపాధ్యాయుడిని సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. న్యాయం జరిగే వరకు పదవ తరగతి విద్యార్థులు పరీక్ష రాయమన్నారు. విద్యార్థులను ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌, ఉపాధ్యాయులు నచ్చజెప్పినా వినలేదు. ఏఎస్‌ఐ మల్లేశం అక్కడికి చేరుకుని విద్యార్థులను సర్దిచెప్పారు. సమస్య పరిష్కరించేందుకు అధికారులతో మాట్లాడుతామని చెప్పారు. దీంతో విద్యార్థులు ధర్నా విరమించారు. పదవ తరగతి విద్యార్థులు పరీక్ష రాసేందుకు వెళ్లారు. అనంతరం పాఠశాలలో డీఈఓ విజయ గురుకులంలో విచారణ చేశారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యను అడిగి తెలుసుకున్నారు.

అప్పటి వరకు పరీక్ష రాయం

ఎస్టీ గురుకుల విద్యార్థుల ధర్నా

Advertisement
 
Advertisement
Advertisement