నిర్లక్ష్యంతోనే రోడ్డు ప్రమాదాలు
ఎస్పీ డీవీ శ్రీనివాసరావు
మెదక్ కలెక్టరేట్: రోడ్డు ప్రమాదాలు విధి రాతకాదని.. నిర్లక్ష్య ఫలితమేనని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. బుధవారం మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన అరైవ్–అలైవ్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. జిల్లాలో గతేడాది 287 మంది ప్రాణాలు కోల్పోగా, 631 మంది గాయపడినట్లు చెప్పారు. రోడ్డు ప్రమాదాల్లో దాదాపు 60 శాతం బైక్ ప్రమాదాలేనన్నారు. ఇవి కేవలం గణాంకాలు మాత్రమే కాదని, ప్రతి ప్రమాదం వెనుక ఒక కుటుంబం కన్నీరు ఉందన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా రాష్ట్ర పోలీస్శాఖ ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ప్రతి సంవత్సరం నమోదయ్యే హత్యల సంఖ్యతో పోలిస్తే, రోడ్డు ప్రమాదాలు ఎన్నో రెట్లు ఎక్కువ ప్రాణాలను తీ సుకుంటున్నాయని, ఇది ప్రజల నిర్లక్ష్యాన్ని స్పష్టంగా చూపిస్తుందన్నారు. ఇటీవల శంకరంపేట మండలంలో జరిగిన ఒక బైక్ ప్రమాదంలో నలుగురు మృతి చెందడం సమాజానికి గట్టి హెచ్చరిక అని అన్నారు. మన కుటుంబాల భద్రత.. మన భవి ష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలన్నారు. చివరగా విద్యార్థులతో రోడ్డు భద్రత అవగాహన ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ మహేందర్, కళాశాల ప్రిన్సిపాల్ హుస్సేన్, డీఎస్పీ ప్రసన్నకుమార్, సీఐ మహేష్, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


