ఇక చెంతనే ఆహ్లాదం
శరవేగంగా అర్బన్ పార్క్ పనులు
రామాయంపేట(మెదక్): ప్రజలతో పాటు ప్రయాణికులు సేద తీరడానికి కేంద్రం నగర వన యోజన పథకం తీసుకొచ్చింది. మండలంలోని అక్కన్నపేట అటవీ ప్రాంతంలో అర్బన్ పార్కు నిర్మాణం చేపట్టింది. ఇందుకోసం రూ. 2 కోట్లు కేటాయించింది. టెండర్ ప్రక్రియ పూర్తి కాగా, పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. నాలుగైదు నెలల్లో ఈ పార్క్ ప్రజలకు అందుబాటులోకి రానుంది.
125 ఎకరాల్లో నిర్మాణం
జాతీయ రహదారి (765 డీజీ)ని ఆనుకొని అర్బన్ పార్క్ నిర్మిస్తున్నారు. ఇది మెదక్ మున్సిపాలిటీకి 13 కిలోమీటర్లు, రామాయంపేట మున్సిపాలిటీకి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇందుకోసం అటవీ ప్రాంతంలో 125 ఎకరాల మేర స్థలం కేటాయించారు. నిర్మాణం పూర్తయిన అనంతరం తాత్కాలిక రుసుముతో దీనిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. వాచ్ టవర్, పగోడ, మెయిన్ గేట్, టాయిలెట్స్, హర్బల్, బొటానికల్ గార్డెన్లు, వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేస్తున్నారు. సోలార్ లైట్లతో పాటు సీసీ కెమరాలు ఏర్పాటు చేయనున్నారు. నిధుల అందుబాటును బట్టి చెక్ డ్యాంలతో పాటు నీటి కుంటలు, రాళ్ల తెట్టెలు, చిన్న పిల్లలు ఆడుకోవడానికి ఆట పరికరాలు ఏర్పాటు కానున్నాయి. అటవీ ప్రాంతాన్ని వీక్షించడానికి వీలుగా వాచ్ టవర్ నిర్మిస్తున్నారు. అరుదైన ఔషద మొక్కలు నాటనున్నారు.
పర్యావరణంపై అవగాహన
కొత్తగా నిర్మిస్తున్న ఈ అర్బన్ పార్కులో ప్రధానంగా సందర్శకులకు పర్యావరణం పట్ల అవగాహన కల్పించనున్నారు. ఇందుకోసం ఎన్విరాన్మెంట్ సెంటర్ నెలకొల్పుతున్నారు. సందర్శకులకు పర్యావరణం, అటవీ ప్రాంతంలో ఉన్న జంతువుల వివరాలు, వాటి మనుగడ, అడవుల సంరక్షణతో కలిగే లాభాల గురించి వివరించనున్నారు.
ఇక చెంతనే ఆహ్లాదం


