నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
హవేళిఘణాపూర్(మెదక్): మెదక్ మండల పరిధిలోని ర్యాలమడుగు సబ్స్టేషన్, మెదక్ ఎన్ఎస్ఎఫ్ సబ్స్టేషన్ పరిధిలో మరమ్మతుల కారణంగా చిట్యాల, జానకంపల్లి, మంభోజిపల్లి, మాచవరం, ర్యాలమడుగు, పేరూర్ తదితర గ్రామాల్లో ఆదివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ రాజ్కుమార్ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ నిలిపివేస్తున్నట్లు చెప్పారు. ఈ విషయంలో ప్రజలు సహకరించాలని కోరారు.
కొనసాగుతున్న
సాఫ్ట్బాల్ పోటీలు
మెదక్జోన్: రాష్ట్రస్థాయి సాఫ్ట్బాల్ పోటీలు రెండో రోజు కొనసాగాయి. ఈనెల 23 వరకు జరిగే స్టేట్ లెవెల్ సీఎం కప్ పోటీల్లో రాష్ట్ర నలుమూలల నుంచి 700 మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఇందులో భాగంగా శనివారం పురుషుల విభాగంలో నల్గొండ, ఖమ్మం, సిద్దిపేట, సూర్యాపేట, జనగాం, నిర్మల్, భూపాలపల్లి, కొత్తగూడెం, మేడ్చల్, జగిత్యాల్, ఆసిఫాబాద్, పెద్దపల్లి, మంచిర్యాల, సిరిసిల్ల, కరీంనగర్, సంగారెడ్డి జిల్లాలు తలపడగా, మహిళా విభాగంలో ఆదిలాబాద్, పెద్దపల్లి, రంగారెడ్డి, నిర్మల్, సంగారెడ్డి, జనగాం తదితర జిల్లాలు తలపడ్డాయి.
పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ
మెదక్ కలెక్టరేట్: పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు టీజీ ఎస్సీ స్టడీ సర్కిల్లో ఉచిత శిక్షణ ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు నేడే ఆఖరని జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారిణి విజయలక్ష్మి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గ్రూప్ 1, 2, 3, 4, ఆర్ఆర్బీ, ఎస్ఐ, కానిస్టేబుల్, ఎస్ఎస్సీ తదితర పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇస్తామన్నారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆదివారం సాయంత్రంలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. డిగ్రీ పూర్తి చేసి రూ. 3 లక్షల లోపు ఆదాయం కలిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు tsstudycercle.co.inలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. మార్చి 1న పట్టణంలోని ప్రతిభ డిగ్రీ కళాశాలలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రవేశ పరీక్ష ఉంటుందని తెలిపారు. మెరిట్ ఆధారంగా 100 మంది అభ్యర్థులను ఎంపిక చేసి 5 నెలల పాటు ఉచిత రెసిడెన్షియల్తో కూడిన శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. పూర్తి వివరాలకు 91822 20112 నంబర్లో సంప్రదించాలన్నారు.
పశు వైద్యంపై నిర్లక్ష్యం వద్దు
నర్సాపూర్ రూరల్: పశు వైద్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దని జిల్లా పశుసంవర్ధక శాఖ ఏడీ వెంకటయ్య సిబ్బందికి సూచించారు. శనివారం మండలంలోని కాగజ్మద్దూర్ పశు వైద్యశాలను సందర్శించారు. రికార్డులను పరిశీలించి వైద్య సేవలపై ఆరా తీశారు. పశువైద్య సిబ్బంది స్థానికంగా అందుబాటులో ఉంటూ పశువులకు నిరంతరం వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. రికార్డులను సక్రమంగా నిర్వహించాలన్నారు. వైద్య సేవల వివరాలు, మందుల నిల్వలను పరిశీలించారు. ఆయన వెంట కాగజ్మద్దూర్ పశు వైద్యాధికారి స్వప్న, ఇతర సిబ్బంది ఉన్నారు.
పనుల్లో వేగం పెంచండి
రామాయంపేట(మెదక్): మండలంలోని అక్క న్నపేట అటవీ ప్రాంతంలో కొనసాగుతున్న నగర వన యోజన పనులను శనివారం జిల్లా అటవీశాఖ అధికారి జోజి పరిశీలించారు. వాచ్టవర్ పైకి ఎక్కి పనుల నాణ్యతను పరిశీలించారు. పగోడ, వాల్ నిర్మాణాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. త్వరితగతిన పను లు పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం గ్రామ శివారులో ఉన్న కొత్త చెరువును పరిశీలించి వెట్ ల్యాండ్ మేనేజ్మెంట్ పథకం కింద చెరువును బాగు చేయిస్తామని పేర్కొన్నారు. ఆయన వెంట రేంజ్ అటవీశాఖ అధికారి విద్యాసాగర్, ఇతర అధికారులు ఉన్నారు.
నేడు బేస్లైన్ టెస్ట్
కొల్చారం(నర్సాపూర్): ఓపెన్ టెన్త్, ఇంటర్ చదువుతున్న అభ్యర్థులకు ఆదివారం మండలంలోని రంగంపేట ఉన్నత పాఠశాలలో బేస్లైన్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు ఓపెన్ స్కూల్ ప్రతినిధి శ్రీధర్రెడ్డి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం


