సందర్శించి.. ఆరా తీసి
నిజాంపేట(మెదక్)/పాపన్నపేట/కౌడిపల్లి/అల్లాదుర్గం/వెల్దుర్తి/శివ్వంపేట/నర్సాపూర్ రూరల్/చేగుంట: జిల్లావ్యాప్తంగా బుధవారం ట్రైనీ గ్రూప్–1 అధికారులు విస్తృతంగా పర్యటించారు. మొదట నిజాంపేట మండల పరిధిలోని చల్మెడలో పర్యటించారు. గొర్రెల కాపరులతో మాట్లాడి మంచి లాభాలు రావాలంటే ఏ విధమైన చర్యలు తీసుకోవాలో అడిగి తెలుసుకున్నారు. అలాగే అంగన్వాడీ సెంటర్లో విద్యార్థులకు అందించే ఆహారాన్ని పరిశీలించారు. అనంతరం రైతులకు పంటలో ఏ విధమైన లాభాలు వస్తున్నాయో అడిగి తెలుసుకున్నారు. అనంతరం మండల కేంద్రంలోని రెవెన్యూ, మండల పరిషత్ కార్యాలయాన్ని సందర్శించారు. అవినీతికి తావులేకుండా సుపరిపాలన కోసం పని చేయాలని సూచించారు. వారి వెంట ఎంపీడీఒ రాజిరెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్, సర్పంచ్ బోమ్మెన మల్లేశం తదితరులు ఉన్నారు. అనంతరం పాపన్నపేట మండల పరిధిలోని మల్లంపేటలో వివిధ శాఖల పాలన, ప్రభుత్వ పథకాల అమలు తీరును పరిశీలించారు. అలాగే కౌడిపల్లి మండలం మహమ్మద్నగర్ చెందిన టమాట రైతు మహిపాల్రెడ్డి వ్యవసాయక్షేత్రాన్ని సందర్శించి సాగు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అల్లాదుర్గం మండల పరిధిలోని గడిపెద్దాపూర్లో పర్యటించారు. విద్య. వైద్యంపై ఆరా తీశారు. కుమ్మరులు చేస్తున్న కుండల తయారీని పరిశీలించారు. ప్లాస్టిక్ వస్తువులు రావడంతో తాము ఉపాధి కోల్పోయినట్లు వారు చెప్పారు. మాసాయిపేట మండలం రామంతాపూర్లో రెండో రోజు పర్యటించారు. పలు కాలనీల్లో పర్యటించి పరిసరాలు పరిశీలించారు. శివ్వంపేట మండల పరిధిలోని సికింద్లాపూర్లో పర్యటించారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనం, ఉపాధిహామీ పనులు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం తదితర ప్రభుత్వ పథకాలు పరిశీలించారు. అలాగే చేగుంట మండల పరిధిలోని రుక్మాపూర్ గ్రామాన్ని సందర్శించారు. అలాగే నర్సాపూర్ మండలంలోని నారాయణపూర్ గ్రామాన్ని సందర్శించారు. పంచాయతీ పరిపాలనతో పాటు మహిళా సంఘాల పనితీరును అడిగి తెలుసుకున్నారు.
జిల్లావ్యాప్తంగా
ట్రైనీ గ్రూప్–1 అధికారుల పర్యటన


