చేపా చేపా ఎక్కడికెళ్లావ్!
చేపా చేపా ఎక్కడికెళ్లావ్! మెదక్జోన్: చేపల పెంపకమే జీవనాధారంగా బతుకు వెల్లదీస్తున్న మత్స్యకారులకు కష్టకాలం మొదలైంది. ఉచిత చేప పిల్లల సరఫరా కోసం ప్రభుత్వం టెండర్ పిలిచినా, కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. గతేడాది సైతం ఇదే పరిస్థితి నెలకొనడంతో నామమాత్రంగా చేప పిల్లలను పంపిణీ చేసి మమ అనిపించారు. దీంతో చేసేది లేక మత్స్యకారులు లక్షలాది రూపాయలు వెచ్చించి చేప పిల్లలు కొనుగోలు చేసి చెరువుల్లో పోశారు. కాగా ఈ ఏడాది అదే పరిస్థితి దాపురించింది. జిల్లావ్యాప్తంగా 1,728 చెరువులు చేప పిల్లలను పెంచేందుకు అనువైనవిగా గుర్తించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అన్నీ నిండుకుండల్లా మారి అలుగులు దంకుతున్నాయి. ఈఏడాది 5.30 కోట్ల చేప పిల్లలను వదిలేందుకు అధికారులు అంచనా వేశారు. ఇందుకు గానూ రూ. 4.70 కోట్లు ఖర్చవుతాయని లెక్కలు వేశారు. ఈ మేరకు ఆగస్టు 18న టెండర్ నోటిఫికేషన్ వేశారు. 15 రోజుల పాటు కాంట్రాక్టర్ల కోసం వేచి చూశారు. అయినా ఎవరూ ముందుకు రాకపోవడంతో మరో వారం గడువు పొడిగించారు. అయితే ఈసారి సైతం కాంట్రాక్టర్లు ముందుకు రావటం కష్టమేనని తెలుస్తోంది.
గతంలో రాష్ట్రవ్యాప్తంగా చేప పిల్లలను సరఫరా చేసిన కాంట్రాక్టర్లకు ప్రభుత్వం రూ. 120 కోట్లు బకాయి పడింది. అందులో కేవలం రూ. 30 కోట్లు చెల్లించగా, మరో రూ. 90 కోట్లు బకాయి ఉన్నట్టు తెలిసింది. అందులో మెదక్ జిల్లాకు సంబంధించి రూ. 6 కోట్ల పైచిలుకు బకాయిలు ఉన్నట్లు ఓ అధికారి తెలిపారు. పాత బకాయిలు చెల్లించే వరకు చేప పిల్లలు సరఫరా చేయవద్దని కాంట్రాక్టర్లు నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.
చేప పిల్లల పంపిణీ కోసం కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో చేపల వేటనే ఆధారంగా జీవనం సాగించే వేలాది మంది మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో 309 మత్స్యకారుల సంఘాలు ఉండగా, 16,820 మంది మత్స్యకారులు ఉన్నారు. ఏటా ఆగస్టులో చెరువుల్లో చేప పిల్లలను పోస్తేనే అవి సకాలంలో ఎదుగుతాయి. 8 నుంచి 10 నెలల వ్యవధిలో కిలో నుంచి ఆపై బరువు పెరుగుతాయి. అదును దాటుతున్నా చెరువుల్లో చేప పిల్లలను వేయకపోవడంతో ఆలస్యమవుతున్నా కొద్దీ చేపల ఎదుగుదలపై తీవ్ర ప్రభావం ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉచిత చేప పిల్లల పంపిణీ కోసం ఆగస్టు 18న టెండర్ నోటిఫికేషన్ ఇచ్చాం. ఈనెల 1న ఓపెన్ చేయాల్సి ఉంది. కానీ ఎవరూ టెండర్ వేయకపోవడంతో ఉన్నతాధికారుల ఆదేశం మేరకు మరో వారం గడువు పొడిగించాం.
– మల్లేశం, ఏడీ ఫిషరీస్
● చేప పిల్లల పంపిణీపై నీలినీడలు
● నోటిఫికేషన్ ఇచ్చినా ముందుకు రాని కాంట్రాక్టర్లు
● మరోవారం గడువు పొడిగింపు
పేరుకుపోయిన బకాయిలు
ఆలస్యమైతే ఎదుగుదల కష్టమే!
నిండుకండలా కోంటూరు చెరువు
ఉచిత చేప పిల్లల పంపిణీపై నీలినీడలు అలుముకున్నాయి. జిల్లాలో టెండర్ల ప్రక్రియ ప్రారంభం అయినా, కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. దీంతో మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మరో వారం పొడిగించాం
1/2
చేపా చేపా ఎక్కడికెళ్లావ్!
2/2
చేపా చేపా ఎక్కడికెళ్లావ్!