
రుణమాఫీ పూర్తిస్థాయిలో చేయాలి
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తం
కలెక్టర్ రాహుల్రాజ్
ఎమ్మెల్యే సునీతారెడ్డి
కౌడిపల్లి(నర్సాపూర్): కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం కౌడిపల్లి రైతు వేదికలో కొత్తగా మంజూరైన రేషన్ కార్డులను కలెక్టర్ రాహుల్రాజ్తో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అర్హులైన వారికీ, వందశాతం రుణమాఫీతో పాటు, సాగు రుణాలు ఇవ్వాలన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 9900 రేషన్ కార్డుల పంపిణీ చేశామన్నారు. అనంతరం ఆయన కౌడిపల్లిలోని ఉన్నత పాఠశాలలో తనిఖీలు నిర్వహించి, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్పర్సన్ సుహాసిని రెడ్డి, ఆర్డీఓ మహిపాల్రెడ్డి, డీఎల్పీఓ సాయిబాబా, డీఎస్ఓ సత్యానంద్, తహసీల్దార్ కృష్ణ, ఎంపీడీఓ శ్రీనివాస్, హెచ్ఎం లలితాదేవి తదితరులు పాల్గొన్నారు.
అర్హులకు సంక్షేమ ఫలాలు అందాలి
కొల్చారం(నర్సాపూర్): సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రేషన్కార్డు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు గుర్తింపుగా పనిచేస్తుందని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో 6 లక్షల 80 వేల రేషన్ కార్డులను ఇచ్చామని గుర్తు చేశారు. వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్న ప్రస్తుత తరుణంలో రైతులకు ఎరువుల కొరత లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఉచిత బస్సు సౌకర్యం మంచిదే అయినప్పటికీ, అదనపు బస్సులు నడపకపోవడం విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. కలెక్టర్ రాహుల్రాజ్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 9961 మందికి కొత్త రేషన్ కార్డులు, 31వేల అదనపు సభ్యులను రేషన్ కార్డులో చేర్చామన్నారు. కార్యక్రమంలో డీఎస్ఓ నిత్యానంద, నర్సాపూర్ ఆర్డీవో మహిపాల్ రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్ చారి, డిప్యూటీ తహసీల్దార్ నాగవర్ధన్, ఆర్ఐ ప్రభాకర్, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ రమేష్ కుమార్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గౌరీ శంకర్, యువత అధ్యక్షుడు సంతోష్ రావు పాల్గొన్నారు.
కొల్చారం(నర్సాపూర్): వానాకాలంలో సీజనల్ వ్యాధుల పట్ల వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బందికి సూచించారు. శుక్రవారం ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఆసుపత్రిలోని రికార్డులను, రిజిస్టర్లను తనిఖీ చేశారు. వార్డులను పరిశీలించారు. ఆసుపత్రి ద్వారా అందుతున్న వైద్య సేవలపై రోగులతో మాట్లాడారు.ప్రతి ఇంట్లో జ్వర సర్వే తప్పనిసరిగా నిర్వహించాలని సిబ్బందిని ఆదేశించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.

రుణమాఫీ పూర్తిస్థాయిలో చేయాలి