
కొనసాగుతున్న నిరసన
జిన్నారం (పటాన్చెరు): గుమ్మడిదల మండలం నల్లవల్లి గ్రామపంచాయతీ పరిధిలోని ప్యారానగర్ డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు వ్యతిరేకంగా జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనలు 138వ రోజుకు చేరుకున్నాయి. నల్లవల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన రిలే నిరాహార దీక్షలో స్థానిక మహిళలు పాల్గొని సంఘీభావం తెలిపారు. పచ్చని అడవిలో డంపింగ్ యార్డ్ ఏర్పాటుచేస్తే పర్యావరణానికి విఘాతం కలుగుతుందని, స్థానిక ప్రజల జీవనంపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. డంపింగ్యార్డ్ నిర్మాణ పనులు నిలిపేవరకు తమ ఆందోళనలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. కార్యక్రమంలో గ్రామస్తులు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.